హైదరాబాద్ : తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ఆర్మీ సాయంతో ఆక్సిజన్ రవాణా చేసుకున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాలకు ఆక్సిజన్ను రవాణా చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి రోజుకు 270 టన్నుల ఆక్సిజన్ అవసరం కాగా రోజుకు 400 టన్నుల ఆక్సిజన్ వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా 5.76 లక్షల లీటర్ల ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఆక్సిజన్ పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారులను నియమించినట్లు వివరించారు.
10 వేల బెడ్స్కు ఆక్సిజన్ సదుపాయం కల్పించినట్లు చెప్పారు. గాంధీలో అదనంగా మరో 400 ఆక్సిజన్ బెడ్లు, టిమ్స్లో అదనంగా 300, నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో 350, నిమ్స్లో అదనంగా మరో 200 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా వారంలో మరో 3,500 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల అంతగా లేదని, మహారాష్ట్రలోనూ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు మంత్రి తెలిపారు. రోగులు పెరిగినా ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా నియామకాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. హోం ఐసోలేషన్లో ఉన్న వారిని ప్రతి నిత్యం రెండుసార్లు పరిశీలించి వాళ్ల ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాల్సిందేనని ఆరోగ్య కార్యకర్తలను ఆదేశించామన్నారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే ఆస్పత్రికి రికమెండ్ చేయాలన్నారు. ప్రభుత్వ పరంగా ఉన్న ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స కొనసాగుతుందన్నారు. గతంలోలాగా 14 రోజులు ఉంచుకోకుండా రోగి పరిస్థితి మెరుగ్గా ఉందని నివేదిక వస్తే కొద్ది కిందిస్థాయి సెంటర్లకు వారిని మార్చే యోచన చేస్తున్నట్లు తెలిపారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులు లాభాపేక్షతో వ్యవహరించడం సరికాదని మంత్రి అన్నారు. ఇటు ఉద్యోగుల కార్డును అంగీకరించక, అటు ఇన్సూరెన్స్ను అంగీకరించక.. రెమ్డిసివిర్, ఆక్సిజన్ తెచ్చుకోవాలని, కొవిడ్తో చనిపోతే డబ్బులు కట్టందే మృతదేహాన్ని అప్పగించం అంటూ ఇలా నానా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆదేశాలు, జీవోలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ర్యాపిడ్ టెస్టుకు రూ.500 మాత్రమే వసూలు చేయాలి. ఇంటికెళ్లి శాంపిల్ సేకరిస్తే రూ.750 వసూలు చేయాలి. మామూలు బెడ్లకు పర్ బెడ్ పర్ డే రూ. 4 వేలు. అదే ఐసీయూలో వెంటిలేటర్ లేని బెడ్కు రూ.7,500, ఐసీయూలో వెంటిలేటర్పై ఉంటే బెడ్కు రూ.9 వేలు మాత్రమే వసూలు చేయాలన్నారు. ఇదే అనువుగా రోగుల భయాందోళనను క్యాష్ చేసుకుంటామంటే సహించేది లేదన్నారు.