EC | హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): లోక్సభకు త్వరలో ఎన్నికలు జరుగనుండటంతో అభ్యర్థుల వ్యయపరిమితిని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఖరారు చేసింది. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా రూ.95 లక్షలు ఖర్చు చేసేందుకు అవకాశం కల్పించింది. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఒక్కో లోక్సభ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు అనుమతి ఇచ్చే వాహనాల సంఖ్యను 5 నుంచి 14కు పెంచింది. గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీల తరఫున నామినేషన్లు వేసే అభ్యర్థులను కనీసం ఒక ఓటరు, ఇతర అభ్యర్థులను కనీసం 10 ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నామినేషన్ దాఖలుకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500, ఇతర అభ్యర్థులు రూ.25 వేల చొప్పున డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. స్టార్ క్యాంపెయినర్లుగా జాతీయ, ప్రాంతీయ పార్టీలు 40 మందిని, రిజిస్టర్డ్ పార్టీలు 20 మందిని నియమించుకునే అవకాశం కల్పించింది. ప్రతి రాజకీయ పార్టీ తమ మ్యానిఫెస్టోను ప్రకటించిన తర్వాత 3 రోజుల్లోగా ఆ ప్రతులను ప్రాంతీయ భాషతోపాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఎన్నికల సంఘానికి సమర్పించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3.30 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారి కోసం మొత్తం 35,356 (పట్టణ ప్రాంతాల్లో 14,464, గ్రామీణ ప్రాంతాల్లో 20,892) పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా చనిపోయిన, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న 6,36,095 మంది ఓటర్లను తొలగించామని, కొత్తగా 10,55,031 మంది ఓటర్లను జాబితాలో చేర్చామని ఈసీ వివరించింది. 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 వేల మందికిపైగా ఓటర్లను తొలగించినట్టు వెల్లడించింది. అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 21 వేల మంది ఓటర్లను తొలగించినట్టు తెలిపింది.
ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సీఈవో భేటీ
తెలంగాణలో ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయడంతోపాటు అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారిపై చర్యలు చేపట్టేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్రాజ్ అధికారులను ఆదేశించారు. లోక్సభ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం ఆయన ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల ప్రతినిధులతో మరోసారి సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే చేపట్టాల్సిన తనిఖీలు, వాటికి సంబంధించిన నిబంధనలు తదితర అంశాలను వారికి వివరించారు. ఓటర్లకు నగదు, మద్యం, డ్రగ్స్తోపాటు విలువైన వస్తువుల పంపిణీని నియంత్రించడంపై పలు సూచనలు చేశారు. పోలీస్, ఈడీ, రవాణా, పోస్టల్, ఐటీ, సెంట్రల్ ఎక్సైజ్, స్టేట్ ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖల ప్రతినిధులతోపాటు డీఆర్ఐ, ఎస్ఎల్బీసీ, ఎయిర్పోర్ట్ అథారిటీ, స్టేట్ ఏవియేషన్, ఆర్బీఐ, నార్కోటిక్స్ బ్యూరో, ఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ తదితర విభాగాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
అత్యధిక తొలగింపులు ఇక్కడే..అసెంబ్లీ తొలగించిన నియోజకవర్గం ఓట్లు