హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్ (జేఈఈ అడ్వాన్స్డ్) పరీక్షలు సజావుగా ముగిశాయి. ఆదివారం రెండు సెషన్లల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం పేపర్ -1 కన్నా, మధ్యాహ్నం పేపర్ -2 కఠినంగా ఉన్నట్టు విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
గణిత ప్రశ్నల నిడివి అధికంగా ఉండగా, కెమిస్ట్రీ సులభంగా వచ్చింది. జనరల్ క్యాటగిరీ కటాఫ్ మార్కులు 70 నుంచి 75 మార్కులు ఉండవచ్చని నిపుణులు విశ్లేషించారు. మొత్తం 360 మార్కులకుగాను 340 మార్కులతో స్టేట్ టాపర్గా నిలిచే అవకాశాలున్నాయని అంచనా వేశారు. ఫలితాలు సెప్టెంబర్ 11న విడుదల కాగా, 12 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నది.
పలు పరీక్షా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కంప్యూటర్ తెరలపై ప్రశ్నలు సరిగ్గా కనిపించక కొంత మంది విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. మరికొన్ని కంప్యూటర్ తెరలపై ఒకే ప్రశ్న రెండు స్క్రీన్లపై ప్రత్యక్షమైంది. దీని వల్ల విద్యార్థుల సమయం వృథా అయ్యింది.