14ఏండ్లలోపు పిల్లలను పనుల్లో పెట్టుకుంటే చర్యలు : కలెక్టర్ వెంకట్రావు
మహబూబ్నగర్, జూన్ 14 : బాలబాలికలకు బంగారు భవిష్యత్ అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జెడ్పీ సమావేశమందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో బాలకార్మికులపై రూపొందించిన పోస్టర్లను ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2016లో సవరించిన లేబర్ యాక్ట్ ప్రకారం 14ఏండ్లలోపు పిల్లలను పనుల్లో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. 14-18 ఏండ్లలోపు పిల్లలను ప్రమాదకరమైన వృత్తుల్లో నియమించుకోవడం కూడా నేరమని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించి పిల్లలను పనుల్లో పె ట్టుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలకు మంచి వి ద్య అందించేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. ఎవరైనా బాలబాలికలను పనుల్లో పెట్టుకుంటే టోల్ప్రీ నెంబర్ 1098కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, కార్మిక శాఖ సహా య కమిషనర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ కమిషనర్ యాదయ్యగౌడ్, సహాయ అధికారి అల్తాఫ్, జెడ్పీ సీఈవో జ్యోతి ఉన్నారు.
బ్యాంకుల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలి
రైతుబంధు డబ్బులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న తరుణంలో బ్యాంకులకు వచ్చే రైతులకు కనీస సౌకర్యా లు కల్పించాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం జి ల్లా పరిషత్ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. కొవిడ్ను పరిగణలోకి తీసుకొని ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే 08542-241165 నెంబర్కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. 2021 వానకాలానికి సంబంధించి ప్రభుత్వం 2 లక్షల 2వేల223 మంది రైతులకు రూ.230.85 కోట్లు మం జూరు చేసినట్లు చెప్పారు. సమావేశంలో ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శివకుమార్, యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ అధికారి వెంకటేశ్వర్లు, ఏపీజీవీబీ ఏజీఎం మనోజ్కుమార్, సీనియర్ మేనేజర్ క్రాంతికుమార్, జెడ్పీ సీఈవో జ్యోతి, ఎల్డీఎం నాగరాజారావు, ఆర్డీవో పద్మశ్రీ, వ్యవసాయ సహాయ సంచాలకులు వెంకటేశ్, యశ్వంత్, అనిల్ తదితరులు ఉన్నారు.