తిమ్మాపూర్, జూన్ 28: మానకొండూర్ నియోజకవర్గంలో క్వారీల ద్వారా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భారీగా అక్రమాలకు పాల్పడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు. పూడిక తీసేందుకు టెండర్ దక్కించుకున్న సంస్థను స్వాధీనం చేసుకుని ఎల్ఎండీలోని ఇసుకను తోడి.. రిజర్వాయర్ను బొందలగడ్డలా మార్చుతున్నాడని మండిపడ్డారు. ఏ వాగులో చూసినా మట్టి దిబ్బలే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కవ్వంపల్లి ఇకనైనా ఇసుక క్వారీలు బంద్ పెట్టాలని.. లేదంటే రైతులతో కలిసి రోడ్లను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి వద్ద మోయతుమ్మెద వాగులో ఉన్న ఇసుక క్వారీని ఆదివారం ఆయన బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఇసుక తోడిన స్థలాలు, భారీ ఇసుక డంపులను పరిశీలించారు. అనంతరం రసమయి మాట్లాడుతూ.. మోయతుమ్మెద వాగు ఎప్పుడూ నీటితో కళకళలాడేదని అన్నారు. ప్రస్తుతం ఇసుక లేక, నీళ్లు లేక కండ్లల్లో నీళ్లు వస్తున్నాయని అన్నారు. ఎల్ఎండీలో సిల్ట్ తీసేందుకు ఒప్పందం కుదుర్చుకొని, రిజర్వాయర్ పరిధిలో వాగులు ఎక్కడుంటే అక్కడ ఇసుక తోడేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇసుకను తోడేస్తే భూగర్భజలాలు పడిపోతాయని రైతులు భయాందోళన చెందుతున్నారని, ఇష్టం వచ్చినట్టు ఇసుక తీస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడేండ్లలోనే పూర్తి చేసుకుని, దానికి అనుబంధంగా మిడ్మానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, తోటపల్లి రిజర్వాయర్లను నిర్మించినట్టు తెలిపారు. ఆ రిజర్వాయర్లలో ఎప్పుడూ నీళ్లు ఉండేలా చూశామని, కానీ 30 నెలల్లో కాంగ్రెస్ సర్కార్ రిజర్వాయర్లను బొందలగడ్డలా మార్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ర్టాన్ని గుంపు మేస్త్రీ రేవంత్రెడ్డి దోచుకుంటుంటే.. మానకొండూర్ నియోజకవర్గాన్ని ముఠా మేస్త్రీ కవ్వంపల్లి దోచేసి ఆగం చేస్తున్నాడని మండిపడ్డారు. ఇసుక, రాయి ఎక్కడ కనిపించినా మాయం చేస్తున్నాడని మండిపడ్డారు. కొత్తపల్లి ఇసుక క్వారీ మొదట ముంబైకి చెందిన సంస్థ టెండర్ దక్కించుకున్నదని, తర్వాత మంత్రి ఉత్తమ్ అనుచరులు తీసుకున్నారని, వారిని భారీగా కమీషన్లు డిమాండ్ చేసి, ఒత్తిడి చేయడంతో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రధాన అనుచరుడి చేతికి క్వారీ వచ్చిందని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాను ఆపకపోతే రైతులతో కలిసి భారీ స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నాయకులు రావుల రమేశ్, సిద్ధం వేణు, శేఖర్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, మహిపాల్రెడ్డి, కార్పొరేటర్ కాల్వ మల్లేశం తదితరులు ఉన్నారు.