హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ)/మర్రిగూడ: మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలోకి వలసల ప్రవాహం కొనసాగుతున్నది. శనివారం మునుగోడులో సీఎం కేసీఆర్ సభ సక్సెస్ కావడంతో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కారు ఎక్కేందుకు క్యూ కట్టారు. పాత, కొత్తలను సమన్వయం చేస్తూ, ఎప్పటికప్పుడు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ విద్యుత్తు శాఖమంత్రి జగదీశ్రెడ్డి.. నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.
తాజాగా ఆదివారం హైదరాబాద్లో మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు గులాబీ గూటీకి చేరారు. మర్రిగూడ మండలం అంతంపేట సర్పంచ్, కాంగ్రెస్కు చెందిన మాదగాని శంకర్గౌడ్, చౌటుప్పల్ మండలం జైకేసారం సర్పంచ్ కోరుపూరి సైదులు, నేలపట్ల సర్పంచ్ వేణుగోపాల్రెడ్డితోపాటు గట్టుప్పల్ మండలం నామాపురం మాజీ ఎంపీటీసీ సభ్యుడు జాజుల శంకర్, వార్డు సభ్యుడు జాజుల నర్సింహ తదితరులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
వారికి జగదీశ్రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, కంచర్ల భూపాల్రెడ్డి, రాష్ట్ర గిరిజన ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ రామచంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు గుంపులు గుంపులుగా గులాబీ గూటికి చేరుతున్నారు. ఇటీవలే మర్రిగూడ మండలానికి చెందిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భిక్షునాయక్, రాజుపేట సర్పంచ్ మూసవత్తో పలువురు నేతలు గులాబీ కండువాలు కప్పుకొన్నారు. చౌటుప్పల్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సర్పంచ్లు టీఆర్ఎస్ చేరుతామని ఇప్పటికే ప్రకటించారు. గట్టుప్పల్ మండల పరిధిలోనూ పలు గ్రామాల కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు