కోటపల్లి, సెప్టెంబర్ 16: కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నది పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డేనని ఆ పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి మారుపాక సుఖేందర్ మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలును శుక్రవారం కాంగ్రెస్లోకి చేర్చుకున్న రేవంత్ను విమర్శిస్తూ ఆయన చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో గౌరవనీయులైన రేవంత్రెడ్డి అంటూ మొదలు పెట్టిన ఆయన.. బూతుల వర్షం కురిపించారు.
ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి.. కాంగ్రెస్ నుంచి మళ్లీ బీఆర్ఎస్లోకి వెళ్లిన నల్లాల ఓదేలును.. తిరిగి కాంగ్రెస్లో ఎలా చేర్చుకుంటావని ఫైర్ అయ్యారు. చెన్నూర్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ కోసం ఇప్పటికే 13 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఓదేలుతో ఆ సంఖ్య 14కు చేరిందన్నారు. ఇప్పుడు చెన్నూర్ టికెట్ను ఎవరికిస్తావని ప్రశ్నించారు. పదేండ్ల నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తుంటే.. ‘మీ లాంటి నాయకులతో మాలాంటి నేతలు నష్టపోవాల్సి వస్తున్నదని’ మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. చెన్నూర్లో మళ్లీ బాల్క సుమన్ విజయం తథ్యమని జోస్యం చెప్పారు.