నల్లగొండ: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు వరుసగా గులాంబీ కండువాలు కప్పుకుంటున్నారు. బుధవారం తెల్లవారుజామున మర్రిగూడెం మండలం వైస్ ఎంపీపీ వెంకటేశ్, లెంకపల్లి సర్పంచ్ పాక నగేశ్, సరంపేట సర్పంచ్ వీ.నర్సింహ, ఎంపీటీసీ శ్రీశైలంతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్ సమక్షంలో కారెక్కారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. శివన్నగూడెం ప్రాజెక్టుతో తమ మండలం సస్యశ్యామలం అవుతుందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నియోజయకవర్గంలో ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. ఆయన మరో పార్టీలో చేరుతుండటంతో.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిథులు, కార్యకర్తలు పెద్దఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఈ క్రమంలో నాంపల్లి మండల పరిధిలోని పెద్దాపురం ఎంపీటీసీ సప్పిడి రాధికా శ్రీనివాస్రెడ్డి, దేవత్పల్లి ఎంపీటీసీ సుజాత శంకర్ బుధవారం ఉదయం మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి-భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.