బిజినేపల్లి, జనవరి 23 : ఆరు నెలల్లో మార్కండేయ రిజర్వాయర్ను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని, లేకుంటే ఎన్నికల్లో పోటీ చేయనని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి స్పష్టంచేశారు. సోమవారం బీఆర్ఎస్ శ్రేణు లు, రైతులతో కలిసి నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్పల్లికి చేరుకొని అక్కడున్న మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ పైలాన్ను కృష్ణా జలాలతో ఎమ్మెల్యే శుద్ధి చేశారు. మార్కండేయ రిజర్వాయర్ స్థలాన్ని నాగం చూడడానికి రావడంతో మైలపట్టిందని, అందుకే ఈ నీటితో శుద్ధి చేశామని చెప్పారు. అనంతరం మర్రి మాట్లాడుతూ.. మొదటగా నిర్ణయించిన ప్లాన్ ప్రకారం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మిస్తే 150 ఎకరాలు ముంపునకు గురవుతుందని సర్వే నిర్వహించి గుర్తించామని, ఆ తర్వాత ప్లాన్ మార్చి పైపులతో ఈ రిజర్వాయర్లోకి నీరు అందేలా చేశామని, దీంతో కేవలం ఏడు ఎకరాలకే నష్టం జరుగుతుందని వివరించారు.
రాత్రిపూట వచ్చే కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మొద్దని, పగటిపూట వస్తే పొలాలకు వచ్చే ఎంజీకేఎల్ఐ నీరు కనిపించేదని మర్రి పేర్కొన్నారు. నాగం రూ.5 కోట్ల ఖర్చు చేసి ఇలాంటి సభలు పెట్టేబదులు పేదల అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నదని స్పష్టం చేశారు.