శంషాబాద్ రూరల్, మే 20: బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి 8.705 కిలోల గంజాయిని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3.05 కోట్లు ఉంటుంది. అధికారుల కథనం ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున బ్యాంకాక్ నుంచి ఇండిగో విమానంలో ఇద్దరు ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగారు. వారి కదలికలపై అనుమానం రావడంతో డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. ఈక్రమంలో వారివద్ద ఉన్న వాటర్ బాటిళ్లు, చిప్స్ ప్యాకెట్లను తనిఖీ చేయగా అందులోనుంచి సుమారు 8.705 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయి బయటపడినట్లు పేర్కొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. గంజాయిని ఎక్కడికి తరలించడానికి తీసుకొని వచ్చారనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్టు డీఆర్ఐ అధికారులు తెలిపారు.