హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): మావోయిస్టులు రూటు మారుస్తున్నారు. సాయుధపోరాటాన్ని వీడి ప్రజాక్షేత్రంలో ప్రభుత్వంపై కొట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. సమసమాజ స్థాపన కోసం వనవాసాన్ని వీడుతున్న అన్నలు రాజకీయాలతో రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా ఓ కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రణాళిక రచించారు.
ప్రస్తుత ఆధునికకాలంలో తాము కోరుకున్న మార్పు ఆయుధాలతో రాదని తెలుసుకున్న మావోయిస్టులు.. తమ పట్ల ప్రజలకున్న అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చుకుని ఆయుధంగా చేసుకోబోతున్నారు. ఈ విషయమై 2019లో మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. ఆ సమావేశంలో మెజార్టీ సభ్యులు రాజకీయ రంగప్రవేశం వైపే మొగ్గు చూపారు. ఆయుధాలతోనే కొట్లాడదామని కొద్ది మంది సభ్యులు కోరినప్పటికీ రాజకీయంగా పోరాడటమే మంచిదని అప్పటి అగ్రనాయకత్వం, మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న నంబాల కేశవరావు నమ్మారు.
ఆ నిర్ణయాల అమలుపై 2024లో మళ్లీ చర్చించాల్సి ఉండగా.. అప్పటికే మావోయి స్టు పార్టీలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 2021లో కేంద్ర కమిటీ సభ్యులు లక్ము, అం బీర్, సాకేత్, ఆనంద్ అనారోగ్యం కారణంగా చనిపోగా.. సుమారు 700మంది పోలీసుల ఎన్కౌంటర్లలో మరణించారు. ఆ తర్వాత మరి కొంతమంది అరెస్టయ్యారు. ఈస్ట్, సెంట్రల్, సౌత్ రీజినల్ కమిటీల మధ్య సమన్వయం లేకపోవడం, ఆపరేషన్ ‘కగార్’తో భద్రతా బలగా లు అడవులను చుట్టుముట్టడంతో పార్టీ మరింత బలహీన పడింది. నంబాల ఎన్కౌంటర్తో మావోయిస్టు పార్టీ ఛిన్నాభిన్నమైంది.
ఆపరేషన్ ‘కగార్’తో చాలా మంది మావోయిస్టు నేతలు భిన్నాభిప్రాయాలతోనే లొంగుబాట పట్టారు. అలా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ, తెలంగాణల్లో లొంగిపోయిన రాష్ట్రస్థాయి కేడర్, జాతీయ స్థాయి కేడర్ మావోయిస్టులు ప్రస్తుతం మీడియాతో రాజకీయ ప్రవేశం గురించే మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఏ పార్టీని విమర్శించకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిషేధిత జాబితాలో ఉన్న మావోయిస్టు పార్టీని కొనసాగించాలా? లేదా? అనే అంతర్మథనం మావోయిస్టు అగ్రనాయకత్వంలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అదే పార్టీ పేరుపై రాజకీయాల్లోకి వస్తే ప్రజల్లో ఆదరణ ఉంటుందనేది వారి ఆలోచన. ఒకవేళ నిషేధం ఎత్తివేతకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా లేకపోతే అనివార్య పరిస్థితుల్లో దేవ్జీ నాయకత్వంలో కొత్త పార్టీ పేరును ప్రకటిస్తారని విశ్వసనీయంగా తెలిసింది.
అందులో భాగంగా కొందరు మావోయిస్టు అగ్రనేతలు కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా మెలుగుతున్న సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయించి, రాజకీయ పార్టీగా గుర్తించేలా సయోధ్య కుదర్చాలని కోరారు. ప్రస్తుతం మావోయిస్టు అగ్రనేతలు రాజకీయాలపై ఆసక్తి చూపుతుండటంతో వారిని ప్రభుత్వ పెద్దలు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలిసింది. సీఎంను కలవాలని నిర్ణయించుకున్న తర్వాత వారు ప్రభుత్వ పెద్దల ద్వారా అపాయింట్మెంట్ కోరారట. ఆ క్రమంలో కాంగ్రెస్ పెద్దలు ఆఫర్ ఇవ్వఇవ్వగా, వారు తిరస్కరించినట్టు తెలిసింది.