హైదరాబాద్ : మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని, వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ర్ట డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనాతో బాధపడుతున్న మావోయిస్టులు లొంగిపోతే.. ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో 25 మంది ఉంటే.. తెలంగాణ నుంచి 11 మంది, ఏపీ నుంచి ముగ్గురు ఉన్నారు. వీరంతా వెంటనే లొంగిపోవాలని, కొవిడ్ బారిన పడకుండా రక్షించుకోవాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. ఇవాళ లొంగిపోయిన మావోయిస్టు నేత, ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్ రావుల రంజిత్ను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా మద్దూరు మండలానికి చెందిన రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న, సావిత్రి దంపతుల కుమారుడు రావుల రంజిత్ అని తెలిపారు. రామన్న, సావిత్రి ఇద్దరూ మావోయిస్టులే. ఈ దంపతులకు 1998లో రంజిత్ జన్మించాడు. దీంతో రంజిత్ బాల్యమంతా దళాలతోనే సరిపోయింది. 1 నుంచి 6వ తరగతి వరకు జనతన సర్కార్ పాఠశాలల్లో చదివాడు. ఈ క్రమంలో చిన్నప్పటి నుంచే మావోయిస్టు కార్యకలాపాల్లో రంజిత్ చురుకుగా పాల్గొన్నాడు.
తన కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలనే ఉద్దేశంతో రంజిత్ను రహస్యంగా పదో తరగతి వరకు చదివించాడు. మావోయిస్టు నగేశ్ సహకారంతో నిజామాబాద్ జిల్లాలోని కాకతీయ స్కూల్లో చేర్పించాడు. ప్రతి సమ్మర్ వెకేషన్లో దండకారణ్యంలో ఉంటున్న తండ్రి రామన్న వద్దకు రంజిత్ వచ్చేవాడు. 2015లో రంజిత్ పదో తరగతి పూర్తి చేశాడు. ఆ సమయంలోనే నగేశ్ చనిపోయాడు. దీంతో రంజిత్ను ఉన్నత విద్య చదివించేందుకు పంపలేదు. తమ కార్యకలాపాలు బయటకు తెలుస్తాయనే భయంతో రంజిత్ చదువును అక్కడితో ఆపేశాడు.
ఇక రంజిత్ 2015 నుంచి 2017 వరకు మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పని చేశాడు. తండ్రి సూచనల మేరకు 2017లో మావోయిస్టు బెటాలియన్లో రంజిత్ చేరాడు. 2019లో తండ్రి రామన్న తీవ్ర అనారోగ్యానికి గురై గుండెపోటుతో చనిపోయాడు. బయటకు తీసుకెళ్లి మెరుగైన వైద్యం చేపిద్దామని చెప్పినా కూడా పార్టీ రంజిత్ వాదనను వినిపించుకోలేదు. ఇక తండ్రి మరణానంతరం రంజిత్కు పార్టీలో వేధింపులు ఎక్కువ అయ్యాయి. ఈ క్రమంలో మావోయిస్టు కార్యక్రమాలపై విరక్తి చెందిన రంజిత్ లొంగుబాటుకు అనుమతి అడిగాడు. కానీ మావోయిస్టు పార్టీ తిరస్కరించింది. దీంతో దండకారణ్యంలో పార్టీలో చురుకుగా పాల్గొంటున్న తన తల్లి సావిత్రి వద్దకు రంజిత్ వెళ్లి తన లొంగుబాటు విషయాన్ని చెప్పాడు. మొత్తానికి తల్లి అనుమతితో రంజిత్ లొంగిపోయాడు. మావోయిస్టు భావజాలంతో ప్రస్తుతం ఎలాంటి ఉపయోగం లేదని రంజిత్ అభిప్రాయపడ్డాడు. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని రంజిత్ విజ్ఞప్తి చేశాడు. రంజిత్ అవగాహన ప్రకారం ప్రతి నెల ఐదారుగురు చేరుతారు.. ఐదారుగురు పారిపోతారు అని రంజిత్ చెప్పినట్లు డీజీపీ వెల్లడించారు.
రంజిత్పై ఉన్న రివార్డు చెక్కు(రూ. 4 లక్షలు)ను అతనికి డీజీపీ మహేందర్ రెడ్డి అందజేశారు. తక్షణ అవసరాల నిమిత్తం రూ. 5 వేల నగదును కూడా అందజేశారు డీజీపీ.