Maoists | ఆయుధాలు వదిలేసి, జనజీవన స్రవంతిలో కలవడంపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. కూంబింగ్ ఆపేస్తే ఆయుధాల్లేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు మావోయిస్టులు లేఖ రాశారు. సీసీఎంలో తీసుకున్న నిర్ణయం మేరకు జోనల్ కమిటీలకు ఇప్పటికే సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 15వ తేదీలోపు ప్రభుత్వాలు స్పందించాలని కోరారు. ప్రభుత్వాలు స్పందిస్తే మార్చి 31 వరకు కాల్పుల విరమణ పాటిస్తామని తెలిపారు. లేదంటే దాడులు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
దేశం, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేస్తూ ఆయుధాలను త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మా పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా ఇటీవల నిర్ణయం తీసుకున్నారని మావోయిస్టు పార్టీ ఆ లేఖలో పేర్కొంది. సోను దాదా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని తెలిపింది. ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ సైతం తుపాకులను వదిలేయాలని భావిస్తోందని చెప్పారు. అయితే మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు తమకు ఫిబ్రవరి 15వ తేదీ వరకు సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నామని తెలిపారు.
ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు తమ పార్టీ కట్టుబడి ఉన్నందున ఈ నిర్ణయాన్ని సమష్టిగా చేరుకునేందుకు తమకు కొంత సమయం పడుతుందని మావోయిస్టులు పేర్కొన్నారు. తమ సహచరులను సంప్రదించి పద్ధతి ప్రకారం వారికి ఈ సందేశాలు తెలియజేసేందుకు సమయం కావాలని కోరారు. ఇంత సమయం అడిగేందుకు ఇతర ఉద్దేశాలు ఏమీ లేవని స్పష్టం చేశారు. త్వరగా కమ్యూనికేట్ చేసేందుకు తమకు వేరే సులభ మార్గాలు లేనందున ఈ వ్యవధిని కోరుతున్నామని వివరించారు. భద్రతా బలగాలు తమ కార్యకలాపాలు నిలిపివేయాలని కోరారు. పీఎల్జీఏ వారోత్సవాన్ని నిర్వహించబోమని… తమ అన్ని కార్యకలాపాలను హామీ ఇస్తున్నామని చెప్పారు.