ములుగు : తెలంగాణలో మావోయిస్టుల సమస్య పునరావృతం కాకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటూ అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ – ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన వెంకటాపురం నూగూరు మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా సరిహద్దు ప్రాంతంలో ఉన్న జిల్లాల పోలీసు అధికారులతో సమీక్షను నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
మావోయిస్టు ఆర్గనైజేషన్ మొత్తంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 1 30 మంది వరకు పనిచేస్తున్నారని ముఖ్యంగా సెంట్రల్ కమిటీలోని 20 మందిలో 11 మంది తెలంగాణకు చెందిన వ్యక్తులు ఉన్నారని ఆయన వివరించారు. వీరంతా అజ్ఞాతం వీడి పోలీసుల ఎదుట లొంగి జన జీవన స్రవంతిలో కలిస్తే పునరావసం కల్పిస్తామని తెలిపారు. అందుకు ప్రభుత్వంలోని అన్ని శాఖలు సహకారాలు అందజేస్తుందని అన్నారు. మావోయిస్టులను అదుపు చేసేందుకు అంతరాష్ట్ర సరిహద్దులోని తెలంగాణ -ఛత్తీస్గఢ్ సరిహద్దులో నిరంతరం పోలీసు ఆపరేషన్స్ కొనసాగుతుందని వెల్లడించారు.
కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల పోలీసు అధికారులతో సమావేశమై శాంతి భద్రతలపై చర్చించానని, వీరంతా చురుకుగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. సీపీఎఫ్, గ్రేహౌండ్స్, జిల్లా పోలీసు, ఎన్ఐబీ రాష్ట్రంలోని అన్ని విభాగాలు సమర్ధవంతంగా పనిచేస్తూ మావోయిస్టుల చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ వెల్లడించారు.