Maoists | వరంగల్ : వరంగల్ పోలీసుల ఎదుట మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. ఈ మేరకు వరంగల్ ప్రస్తుతం ఇంచార్జి పోలీసు కమిషనర్ అభిషేక్ మహంతి వివరాలను వెల్లడించారు. లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులను సుష్మిత, దూలగా పోలీసులు గుర్తించారు. సుష్మిత సెంట్రల్ కమిటీ స్టాఫ్గా, దూల ప్రొటెక్షన్ టీం మెంబర్గా పని చేశారు.
హనుమకొండ జిల్లా హాసన్పర్తి మండలం సుదంపల్లి గ్రామానికి చెందిన తిక్క సుశ్మిత(27) ఇంటర్ వరకు చదువుకుంది. తన తండ్రి తిక్క సుధాకర్ మావోయిస్టు సానుభూతిపరుడిగా పని చేశారు. దీంతో ఆమె మావోయిస్టు పార్టీకి ఆకర్షితురాలై 2016లో ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా కోమటిపల్లి గ్రామ అటవీప్రాంతంలో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సమక్షంలో మావోయిస్టు పార్టీలో చేరింది.
ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లా పరియా గ్రామానికి చెందిన మడకం దూల అలియాస్ దూల ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. తన అన్నయ్య ఐయేత 2008 సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరాడు. దూల కూడా 2015లో ఏరియా కమిటీ మెంబర్ అయిన జోగి ప్రోత్సాహంతో మావోయిస్టు పార్టీలో చేరాడు.
మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న సమయంలో సుష్మిత, దూల మధ్య పరిచయం ఏర్పడింది. 2020 మార్చి 30వ తేదీన వివాహం చేసుకున్నారు. తరువాత వివిధ హోదాల్లో పలు చోట్ల పని చేశారు. మావోయిస్టు సిద్ధాంతాలపై నమ్మకం కోల్పోయి, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకం గురించి తెలుసుకుని వీరిద్దరూ శుక్రవారం వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిరువురికి ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయలు నగదు రివార్డ్ వున్నదని ఆ మొత్తాన్ని బ్యాంకు డీడీ రూపంలో వారికి అందజేసినట్లు పోలీసులు తెలిపారు.