ఆ పార్టీ వరంగల్కు చేసిందేమీ లేదు..
నగరంపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక శ్రద్ధ
రూ.వేలకోట్ల నిధులతో అభివృద్ధి
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
సుబేదారి, ఏప్రిల్ 25: బీజేపీవి ఝూటా మాటలని, ఎన్నికలప్పుడు మాత్రమే టీఆర్ఎస్ పార్టీపై నిరాదారణ ఆరోపణలు చేయడం ఆ పార్టీ నాయకులకు అలవాటుగా మారిందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన పశ్చిమ నియోజకవర్గంలో 60వ డివిజన్ ఎస్బీహెచ్ కాలనీలో టీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం అభినవ్భాస్కర్, చీఫ్విప్ దాస్యం వినయభాస్కర్తో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. వరంగల్ నగరాభివృద్ధిని అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు పట్టించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు హక్కుగా ఇచ్చే నిధులు కూడా వరంగల్కు ఇవ్వడం లేదని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ స్మార్ట్సిటికి కేంద్రప్రభుత్వం రూ.500కోట్ల నిధులు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.196కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.500కోట్లకు అదనంగా మరో రూ.వందకోట్లు కలిపి రూ.600 కోట్లు స్మార్ట్సిటీ కింద నగర అభివృద్ది కోసం ఖర్చు చేసినట్లు చెప్పారు. మొన్నటికి మొన్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నగరంలోని ప్రధానరోడ్లు, జంక్షన్ల సుందరీకరణ, తాగునీటి పైపులైన్లు, అంతర్గత రోడ్లు, పార్కులు ఇలా అనేక అభివృద్ధి పనుల కోసం రూ.1559కోట్లు నిధులతో శంకుస్థాపనులు చేశారని అన్నారు.
టీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచిని వరంగల్పై సీఎం కేసీఆర్కు ప్రత్యేక ప్రేమ ఉందన్నారు. ప్రభుత్వం ముందుచూపుతో మరో 20ఏళ్లలో 30లక్షల జనాభా తాగునీటి అవసరాలు తీర్చేవిధంగా దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఈ ఉగాది నుంచే తాగునీరు అందిస్తున్నదన్నారు. కాజీపేట రైల్వేకోచ్ విషయంలో కానీ, వరంగల్కు విద్య, వైద్య రంగ సంస్థల మంజూరు విషయంలో కానీ కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్నడూ పట్టించుకోలేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో వరంగల్ సిటీలో బస్తీ దవాఖానల ఏర్పాటుతోపాటు మోడల్ ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేస్తామన్నారు.
ఆరేళ్లలో ఎంతో అభివృద్ధి : చీఫ్విప్ దాస్యం
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరవాత గడిచిన ఆరేళ్లలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ పేర్కొన్నారు. గడిచిన ఆరు సంవత్సరాల కాలంలో నగర అభివృద్ధి సీఎం కేసీఆర్ వేలకోట్ల నిధులు కేటాయించారని అన్నారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి చూసి ప్రజలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. మొత్తం 66 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ సోదరుడు, ప్రణయ్భాస్కర్ తనయుడు అభినవ్భాస్కర్ 60వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉండడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుందర్రాజ్, డివిజన్ అధ్యక్షుడు రామ్రాజ్, అమరేందర్,శ్రవణ్, అశోక్, రాము, నాగరాజు, రాకేశ్, రవీందర్ పాల్గొన్నారు.