మహబూబ్నగర్ జిల్లా మన్యంకొండ వేంకటేశ్వరస్వామి తెలంగాణలోనే సుప్రసిద్ధ ఆలయం. పేదల తిరుపతిగా ప్రసిద్ధి. మహబూబ్నగర్-రాయచూర్ మార్గంలో మన్యంకొండ ఆలయ ముఖద్వారం ఉంటుంది. ఆ ద్వారం గుండా ఘాట్రోడ్లో ఏడు కొండలు ఎక్కితే కానీ స్వామి వారి దర్శన భాగ్యం కలుగదు. ప్రస్తుతం భక్తులు ఆ స్వామివారిని దర్శించుకోవాలంటే కొండలను మాత్రమే కాదు.. దారిపొడవునా వరి కుప్పలు, వడ్ల రాసులను దాటుకుంటూ వెళ్లాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ ఎంకన్న స్వామి ఇక్కడ ఏడు కొండలపై శయనించారా? లేక వడ్లరాసులపై శయనిస్తున్నారా? అనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు.
(మన్యంకొండ నుంచి వెల్జాల చంద్రశేఖర్-స్పెషల్ టాస్క్ బ్యూరో) మహబూబ్నగర్ జిల్లా (నమస్తే తెలంగాణ): ఒకనాడు పాలమూరు జిల్లా కరువు కాటకాలకు నిలయం. బుక్కెడు బువ్వ, గుక్కెడు నీళ్ల కోసం అలమటించిన నేల. ఆకలి చావులకు, అంబలి కేంద్రాలకు నెలవు. బతుకుదెరువు భారమై తట్టా,బుట్టా నెత్తిన బెట్టుకొని పిల్లా, జెల్లలను వెంటబెట్టుకొని జిల్లా దాటి, రాష్ట్రం ఎల్లలు దాటి వలసలు వెళ్లడం సర్వసాధారణం. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తదని ఉద్యమ సమయంలో ప్రశ్నించిన వారు ఒకసారి మారిన పాలమూరు జిల్లా రూపురేఖలను చూపిస్తే చాలు.. అదే సమాధానం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమనేత కేసీఆరే ముఖ్యమంత్రి ఆయ్యాక ఆయన ఏలుబడిలో తెలంగాణ జీవన దృశ్యం సమూలంగా మారిపోయింది.
కరువు తాండవించిన చోట ఎక్కడ చూసినా పచ్చని పంట పొలాలు, గలగలపారే కాలువలు, నిండుకుండలా జలవనరులు, దారి పొడవునా కిలో మీటర్లమేర ఆరబోసిన ధాన్యపు రాసులు దర్శనం ఇస్తున్నాయి. తెలంగాణకు వ్యవసాయమే ప్రధాన జీవనోపాధి అయినప్పటికీ సమైక్యపాలకుల వివక్షకు గురైంది. నీటిపారుదల వనరులు లేక వ్యవసాయరంగం కుదేలయ్యింది. వర్షాధార, గొట్టపు బావులపై ఆధారపడిన సేద్యం గాలిలో దీపం మాదిరిగా సాగేది. వర్షాలు పడి, గొట్టపు బావుల్లో నీళ్లున్నా కరెంట్ ఉండేది కాదు. చేతికొచ్చిన పంట చేలు బీటలువారేవి. పెట్టుబడి కోసం చేసిన అప్పు ముప్పై తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకొనేవారు. కానీ.. నేడు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్గా ఎదిగింది. తలసరి ఆదాయం, విద్యుత్తు వినియోగంలో మొదటి స్థానంలో నిలిచింది.
రెండు పర్యాయాల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో కొత్త సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మిషన్ కాకతీయ పథకంతో చెరువులు జలకళను సంతరించుకొన్నాయి. భూగర్భ జలాలు పైకి తన్నుకువచ్చాయి. ఎక్కడ చూసినా పుష్కలంగా నీళ్లు.. ఎకరానికి పది వేల రూపాయల చొప్పున రైతుబంధు.. వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంట్.. దీంతో పుష్కలంగా పంటలు పండుతున్నాయి. కరువు తీరింది. వలసలు ఆగిపోయాయి. ఇప్పుడు పక్క రాష్ర్టాల నుంచి వచ్చే కూలీలకు పని కల్పించే స్థాయికి చేరుకొన్నాం. అయితే ప్రజాస్వామ్య ప్రక్రియలో ఐదేండ్లకోసారి ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోక తప్పదు. ఈ ఎన్నికల్లో తెలంగాణను దక్షిణాది ధాన్య బాండాగారంగా తీర్చిదిద్దిన కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టేందుకు క్షేత్రస్థాయిలో ప్రజలు ఒక తాటిమీదికి వచ్చారు. తిరిగి కేసీఆర్ సర్కారే రావాలని పంతం పట్టారు. మార్పు కాదు.. మళ్లీ కేసీఆర్ సర్కారే రావాలని మనసు నిండా కోరుకుంటున్నారు. మళ్లీ కేసీఆరే హ్యాట్రిక్ సీఎం అని చెప్పేందుకు పాలమూరు జిల్లా ప్రజల మనోగతం ఒక్కటిచాలు.
కేసీఆర్ రాక మునుపు నీళ్లెక్కడియి?.. వడ్లెక్కడియి?.. కేసీఆర్ వొచ్చినంకనే తెలంగాణలో పసిడి పంటలు పండుతున్నయి. కరువుల పాలమూరు కామధేనువు అయ్యింది. ఇట్లా మా బతుకులు బాగుచేసినోళ్లను, అన్నీ ఇచ్చేటోళ్లను ఎందుకు వదులుకుంటం?
– కృష్ణయ్య, రైతు
టీడీపీ, కాంగ్రెస్ జమానాలో మమ్మల్ని (దివ్యాంగులను) ఎవరూ పట్టించుకునేవారు కాదు. కేసీఆర్ వచ్చినంక మొదట 3 వేలు ఇచ్చిండు. ఇప్పుడది 4 వేలు జేసిండు. మా ఊళ్లో అందరికి చెప్పి ఏపిస్త. ఇక్కడ ఏ గాలి లేదు.. అందరం కేసీఆర్ వెంటే ఉంటం.
-నాగన్న, దివ్యాంగుడు, గోప్లాపూర్, దేవరకద్ర
కేసీఆర్ వచ్చినంక చాలినంత కరెంట్ ఇస్తుండు. ఇంకేదీ అవసరం లేదు. మా ఊళ్లో అందరు మంచిగ బతుకుతుండ్రు. ముసలోళ్లకు పింఛన్ ఇస్తున్నరు. రైతులకు పైసలిస్తున్నరు. పంటలు బాగా పండుతున్నయి. ఇంతకంటే ఇంకేమిగావాలె. అందుకే కేసీఆర్ వెంటే నడుస్తం.
– జినగరాళ్ల వరలక్ష్మి, కిరణంషాప్, గోప్లాపూర్, దేవరకద్ర