హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను బుధవారం కూడా పలువురు ప్రముఖులు పరామర్శించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, శాంతాబయోటిక్ అధినేత వరప్రసాద్రెడ్డి, సినీనటుడు అక్కినేని నాగార్జున, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, ప్రకాశ్గౌడ్, కాలేరు యాదయ్య, మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ ఆయన సతీమణి డాక్టర్ మమత, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, బాల్క సుమన్, మహేశ్గౌడ్, నన్నపునేని నరేందర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒంటేరు ప్రతాప్రెడ్డి, దేవీప్రసాద్, దాసోజు శ్రవణ్, గట్టు రామచందర్రావు తదితరులు కేసీఆర్ను పరామర్శించారు. తనను చూసేందుకు దవాఖానకు ఎవరూ రాకూడదని, తనతోపాటు వందలాది మంది పేషెంట్లకు ఇబ్బందులు కలిగించకూడదని కేసీఆర్ మంగళవారం ఓ వీడియో సందేశంలో విజ్ఞప్తి చేశారు. దీంతో బుధవారం దవాఖాన ప్రాంగణంలో సందర్శకుల తాకిడి తగ్గిందని, ఎవరికీ ఇబ్బందులు కలుగలేదని వైద్యులు పేర్కొన్నారు.
డ్రాగన్ ఎలిఫెంట్ పుస్తకంతో కేసీఆర్ కాలక్షేపం
తుంటిఎముక మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్ బుధవారం సందర్శకుల తాకిడి తగ్గటంతో తన దగ్గరికి వచ్చిన ప్రముఖులకు అభివాదం చేస్తూ విశ్రాంతి తీసుకున్నారు. అదే సమయంలో ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త అకోశ్గులాటీ, షెంగ్ఫాన్ సంపాదకత్వంలో వెలువడిన ‘ది డ్రాగన్ అండ్ ది ఎలిఫెంట్’, ‘అగ్రికల్చరల్ అండ్ రూరల్ రిఫార్మ్స్’ అనే పుస్తక పఠనం చేశారు. కేసీఆర్ పుస్తకం చదువుతున్న ఫొటోను రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ట్వీట్ చేశారు.