నందికొండ/ అయిజ/ మదనాపూర్/ శ్రీశైలం/ దేవరకద్ర/ రాజోళి, ఆగస్టు 28 : కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పలు ప్రాజెక్టులకు వరద వస్తున్నది. ఆదివారం శ్రీశైలం డ్యాం ఏడు గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల చేశారు. ఇన్ఫ్లో 2,79,268 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 2,59,233 క్యూసెక్కులుగా నమోదైంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్కు వరద నీరు పోటెత్తింది.
దాంతో ఎన్నెస్పీ అధికారులు ప్రాజెక్టు 20 క్రస్ట్ గేట్లను ఎత్తి 1,59,480 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు 2,51,242 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నది. సాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు (312 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 588.80 అడుగులుగా (308.4658 టీఎంసీలు)గా ఉన్నది.
సాగర్ రిజర్వాయర్ నుంచి కుడి కాల్వకు 9,767 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 9,257, ప్రధాన జలవిద్యుత్తు కేంద్రానికి 33,008, ఎస్ఎల్బీసీకి 2400, వరద కాల్వకు 400 మొత్తం 2,14,312 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా సాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాగర్ డ్యాం, లాంచీ స్టేషన్, జల విద్యుత్తు కేంద్రం వద్ద రద్దీ కన్పించింది.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. ఆదివారం ఇన్ఫ్లో 49,128 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 49,128 క్యూసెక్కులుగా నమోదు కాగా 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆర్డీఎస్కు ఇన్ఫ్లో 1,10,416 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,10,000 క్యూసెక్కులుగా నమోదైంది. జూరాల ప్రాజెక్టుకు 1.85 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా 37 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అవుట్ఫ్లో 1,91,471 క్యూసెక్కులుగా నమోదైనట్టు అధికారులు తెలిపారు.