హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టినట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున విదేశీ, స్వదేశీ పర్యాటకులు తరలివస్తున్నారన్నారు. ‘ఫ్లై హై టూరిజం’ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్సైట్ను హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం పర్యాటకులకు స్వర్గధామంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. చారిత్రక, వారసత్వ, ప్రకృతి సిద్దంగా ఏర్పడిన అనేక పర్యాటక ప్రదేశాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయన్నారు. తెలంగాణ పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్ను నిర్వహించి రాష్ట్రానికి పర్యాటకులను ఆకర్షిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ‘ఫ్లై హై టూరిజం’ నిర్వాహకులు యశ్ పాల్ వీరగోని, సోనియా తదితరులు పాల్గొన్నారు.