కోసమే హడావుడిగా ప్రెస్మీట్?హైదరాబాద్, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎన్నో కీలక కేసుల ఆధారాలు కాలిపోయాయని, అవి ఏయే కేసులవనేది అంచనా వేస్తున్నామని ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్, డైరెక్టర్ జనరల్ శిఖాగోయెల్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం నాం పల్లిలోని ఎఫ్ఎస్ఎల్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ప్రమాదం జరిగిన తీరు, ఫైర్ రెస్క్యూ గురించి వివరించారు. ఆ తర్వాత ప్రత్యేకించి ఓటుకు నోటు కేసు పేరు తీసుకురాకుండా ఏసీబీ కేసు, దాని ఎఫ్ఐఆర్ నంబర్తో ఆ కేసు గురించి మాట్లాడారు. ఆర్సీఏ నెంబర్ 11/ఏసీబీ/సీఆర్ఐ/2015 ఏసీబీ కేసు మెటీరియల్ అబ్జెక్ట్స్ తమ వద్ద లేవని చెప్పారు. ఈ కేసు గురించి సోషల్ మీడియాలో, పలు వార్తాపత్రికలు, మీడియా చానళ్లలో వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దని కోరారు. అప్పటికే ఆ కేసు ఆధారాలు కాలిపోయాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని డైరెక్టర్ స్పష్టంచేశారు. ఆ కేసులో 16 మెటీరియల్ వస్తువులను ఆ ఏడాదే పరిశీలించి నివేదికలు ఇచ్చామని, ఆ వస్తువులన్నింటినీ మార్చి 2021లోనే న్యాయస్థానానికి తిరిగి అప్పగించామని తెలిపారు. కాబట్టి ప్రమాదం జరిగిన సమయంలో ఆ కేసుకు సంబంధించిన ఎలాంటి ఆబ్జెక్ట్స్ ల్యాబ్లో లేవని శిఖా గోయల్ పేరొన్నారు.
అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె ముక్తసరిగా సమాధానాలు ఇచ్చారు. అగ్నిప్రమాద నష్టంపై అంచనాలు సిద్ధం చేస్తున్నామని శిఖాగోయెల్ చెప్పారు. చాలా కేసుల్లో మెటీరియల్ డ్యామేజీ జరిగిందని, వాటిని రిట్రివ్ చేసే పనిలో తమ సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఏ కేసులో ఏ మెటీరియర్ డ్యామేజ్ అయ్యిందో తేల్చడానికి కొంత టైం పడుతుందని చెప్పారు. ఇప్పుటికే కొన్ని కేసుల ఆధారాలు రిట్రీవ్ చేస్తున్నట్టు చెప్పారు. ఏ కేసులైలోనైనా ఆధారాలు ధ్వంసమైనట్టు తేలితే.. ఆ వివరాలను మళ్లీ పబ్లిక్ డొమైన్లో పెడతామని తెలిపారు. సిబ్బంది నిర్లక్ష్యంపై పోలీసులు విచారణ చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం విచారణ జరుగుతున్నదని, ఎన్ని సిస్టమ్స్, పెన్ డ్రైవ్స్, ఇతర సామగ్రి కాలిందనేపై త్వరలోనే స్పష్టత వస్తుందని తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన అగ్నిమాపకశాఖ నుంచి తమకు రిపోర్టు రాలేదని చెప్పారు. ఇప్పటికిప్పుడు ప్రమాదానికి కారణం ఏమిటో చెప్పలేమని, పోలీసుల విచారణలోనే నిజాలన్నీ తెలుస్తాయని తెలిపారు. సమావేశంలో హైదరాబాద్ జాయింట్ సీపీ శ్వేత, ఎఫ్ఎస్ఎల్ అధికారులు పాల్గొన్నారు. మొత్తానికి సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో అటు సీఎంవో నుంచి, ఇటు పోలీసు పెద్దల నుంచి ఒత్తిడి రావడంతోనే ఆ కేసు క్లారిఫికేషన్ కోసమే హడావిడిగా ప్రెస్మీట్ పెట్టారని సమాచారం.
పంజాగుట్ట కేసులో7 ఐటెమ్స్ ఉన్నాయి
పంజాగుట్ట పోలీస్స్టేషన్ కేసు (ఫోన్ట్యాపింగ్) (క్రైమ్ నం. 243/2024) విషయంలో కూడా తప్పుడు ప్రచారం జరుగుతున్నదని, ఈ కేసుకు సంబంధించి అందిన 136 వస్తువుల్లో ఏడు ఐటమ్స్ మినహా అన్ని వస్తువుల పరిశీలన ఇప్పటికే పూర్తయిందని శిఖా గోయల్ తెలిపారు. వాటి నివేదికలు ఇప్పటికే సమర్పించామని తెలిపారు. కాగా, 7 ఐటమ్స్ పరిశీలన కూడా పూర్తయి నివేదికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ఈ కేసులోని ఆ వస్తువులన్నీ భద్రంగా ఉన్నాయని శిఖాగోయెల్ స్పష్టం చేశారు. ఆబ్జెక్ట్స్ను సురక్షితంగా స్వాధీనం చేసుకున్నామని, ల్యాబ్లో సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని వివరించారు. విచారణ జరుగకముందే సోషల్ మీడియాలో వచ్చే అసత్య వార్తలను ప్రజలు, మీడియా ప్రతినిధులు నమ్మవద్దని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.