జయశంకర్ భూపాలపల్లి, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతి అని, ఇప్పటికే ఎన్నో ప్రయోజనాలను సింగరేణి కార్మికులకు చేకూర్చారని, ఇక ముందు కూడా చేస్తారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎమ్మె ల్సీ కవిత చెప్పారు. కోలిండియాలో లేని అనేక ప్రయోజనాలను సింగరేణి కార్మిక సోదరులకు సాధించిపెట్టారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గని కార్మికులకు వాటి గురించి తె లియజెప్పాలని యువ కార్మికులకు ఆమె పిలుపునిచ్చారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయ భవనా న్ని ఆమె ప్రారంభించారు. అనంతరం సంఘం అధ్యక్షుడు బీ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సింగరేణి యువ కార్మికుల సమావేశంలో కవిత మాట్లాడుతూ.. దేశ పాలన తిరోగమన దిశలో సాగుతుంటే, మన తెలంగాణ అభివృద్ధిలో కొత్త చరిత్ర సృష్టిస్తున్నదని చెప్పారు.
కేంద్రంలోని మోదీ సర్కారు దేశంలోని బొగ్గు బ్లాకుల వేలం, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే చర్యలకు దిగుతున్నదని విమర్శించారు. అదే మన రాష్ట్రంలో ప్రభుత్వరంగ సంస్థ సింగరేణిని కాపాడుకుంటూ ముందుకుసాగుతున్నామని స్పష్టంచేశారు. కేంద్రంలో బీసీ సంక్షేమశాఖను పెట్టాలని మనం కోరితే.. కేంద్ర సర్కారు మాత్రం దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి ఓ ప్రత్యేకశాఖను పెట్టిందని మండిపడ్డారు. ఆ ప్రత్యేక శాఖ పేరు ‘దీపం’ అని పేరు పెట్టి పేద ల జీవితాల్లో మాత్రం చీకటిని నింపుతున్నదని ధ్వజమెత్తారు. సింగరేణిలో 18 వేల మందికి కారుణ్య నియామకాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని అన్నారు. ఒక సంస్థను కాపాడుకోవాలంటే చాలా పట్టుదల, ధైర్యం కావాలని, ఆ సంకల్పం, దక్షత రెండూ ఉన్న నాయకుడే కేసీఆర్ అని పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితోపాటు 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రం, 300 మెగావాట్ల సోలార్ విద్యుత్తు కేంద్రాలను నెలకొల్పిందని అన్నారు.
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల విషయమై ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. బీఆర్ఎస్ దేశంలో కీలకంగా పని చేయబోతున్నదని చెప్పారు. ఇక్కడ అమలుచేస్తున్న పథకాలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని బీఆర్ఎస్, అనుబంధ సంఘాల శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎందరికో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే ప్రభుత్వం కేంద్రంలో ఉండటం మన దురదృష్టమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజానీకం తమ రాష్ట్రంలో అమలైతే బాగుండని కోరుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షురాలు జ్యోతి, టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు హరీశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రామప్పలో కవిత ప్రత్యేక పూజలు
ఎమ్మెల్సీ కవిత రామప్ప, గణపురంలోని కోటగుళ్లను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కోటగుళ్ల గోశాలకు ఆమె రూ.30వేల విరాళాన్ని అందజేశారు. ఆచార్య జయశంకర్ విగ్రహానికి మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సెంటర్ వరకు శ్రేణులతో ర్యాలీగా కాలినడకన వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇటీవల మరణించిన టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.