మునుగోడు, అక్టోబర్ 1 : కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వార్థం వల్లే మునుగోడుకు ఉపఎన్నిక వచ్చిందని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. దొంగతనం చేసిన వాడే దొంగా దొంగా.. అన్నట్టు మోటర్లకు మీటర్లు పెట్టాలని జీవోలు జారీ చేసిన బీజేపీ నాయకులు రైతు రాజ్యం తెస్తామనడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని పలివెల గ్రామంలో శనివారం నిర్వహించిన రైతు ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నాయకులు మోసపూరితమైన హామీలిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.22 వేల కాంట్రాక్టుల కోసం మునుగోడును తాకట్టు పెట్టిన రాజగోపాల్రెడ్డి.. ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. మునుగోడు అభివృద్ధి పేరుతో తన జేబులు నింపుకొనేందుకే రాజగోపాల్రెడ్డి పని చేస్తున్నాడని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్లో విద్యుత్తు చట్టం చేసి మోటర్లకు మీటర్లు బిగించాలని రాష్ట్ర ప్రభుత్వాల మెడపై కత్తి పెట్టి ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.
టీఆర్ఎస్లో పలువురి చేరిక
మునుగోడు మండల కేంద్రం, పలివెల, ఇప్పర్తి గ్రా మాల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. నాంపల్లి మండలంలోని తుంగపహాడ్కు చెందిన బీజేపీ నాయకుడు నేతళ్ల శ్రీను, కాంగ్రెస్ నుంచి నేతళ్ల యాదయ్య, మరికొందరు గులాబీ కండువా కప్పుకొన్నారు. మర్రిగూడ మండలం లెంకలపల్లికి చెందిన 15 కుటుంబాల వారు కాంగ్రెస్ నుంచి, చౌటుప్పల్ మండలంలోని ఎనగంటి తండాకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు 20మంది మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.