హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్లో తాజాగా ఇద్దరి చేరిక ఆ పార్టీలో చిచ్చు రేపింది. పెద్దపల్లి రిజర్వుడ్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత, మహబూబ్నగర్ టికెట్ ఆశిస్తూ పారిశ్రామికవేత్త మన్నె జీవన్రెడ్డి మంగళవారం ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పెద్దపల్లి, మహబూబ్నగర్ నుంచి టికెట్ ఆశిస్తున్న పార్టీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి చల్లా వంశీచంద్రెడ్డి, పెద్దపల్లి స్థానం నుంచి ఎమ్మెల్యే వివేక్ తనయుడు వంశీకృష్ణ టికెట్ ఆశిస్తున్నారు. తమకు టికెట్ గ్యారంటీ అన్న ధీమాతో వీరు ఇప్పటికే ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టారు.
మన్నె జీవన్రెడ్డి కాంగ్రెస్లో చేరబోతున్నారన్న సమాచారంతో మూడు రోజుల కిందట వంశీచంద్రెడ్డి సీఎం రేవంత్రెడ్డిని కలిసి తన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని రెండు లోక్సభ నియోజకవర్గాల ఎన్నికల వ్యయాన్ని మోయడానికి జీవన్రెడ్డి మాట ఇవ్వడం వల్లనే ఆయనను పార్టీలో చేర్చుకున్నట్టు అధిష్ఠానం వంశీచంద్రెడ్డికి చెప్పిందని సమాచారం. రాజ్యసభలో రాష్ట్రం నుంచి ఖాళీ అయ్యే మూడు స్థానాల్లో ఒకటి వంశీచంద్కు ఇస్తామని పార్టీ పెద్దలు చెప్పినట్టు తెలిసింది. దీనిపై రేవంత్రెడ్డి కూడా హామీ ఇచ్చినట్టు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ మంత్రివర్గంలో స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో కనీసం తన కుమారుడు వంశీకృష్ణకు పెద్దపల్లి నుంచి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరగా పార్టీ పెద్దలు సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. అయితే వివేక్ ఆశలపై నీళ్లు చల్లుతూ ఎంపీ వెంకటేశ్ నేతను కాంగ్రెస్లో చేర్చుకోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.