Mandakrishna Madiga | కామారెడ్డి, నవంబర్ 3: ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ వ్యతిరేకమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు వేరు, చేతలు వేరుగా ఉన్నాయని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే.. దేశంలో వర్గీకరణను తానే మొదట అమలు చేస్తానని రేవంత్రెడ్డి అసెంబ్లీలో ప్రకటించి ఆపై మాట తప్పారని విమర్శించారు. వర్గీకరణ లేకుండా ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కార్ సిద్ధపడుతున్నందుకు నిరసనగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాదిగల ధర్మయుద్ధం మహాసభ నిర్వహించారు.
ఈ మందకృష్ణ మాట్లాడుతూ.. మాల ఎమ్మెల్యేలు, ఎంపీలు నియోజకవర్గాల్లో తిరుగుతూ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. వారిని ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసినప్పుడు మాదిగలు అండగా నిలిచారని, నీతి, నిజాయితీ ఉంటే మాదిగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 2004లో ఎస్సీ వర్గీకరణను 24 గంటల్లో రద్దు చేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణ అమలుచేయాలని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా అమలుచేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని మండిపడ్డారు.