ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్రెడ్డిని రాబోయే రోజుల్లో గద్దె దింపడం ఖాయం అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. జూన్ 11వ తేదీలోగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరం సంఘటితమై ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు. నమ్మించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా మోసం చేసిందో రిజర్వేషన్ పెంపుదల నిర్లక్ష్యమే నిదర్శనమని అన్నారు.
ఆయా వర్గాలను నమ్మించేందుకు అదే వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను చేవెళ్లకు తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ పెంచుతున్నట్లు డిక్లరేషన్ చేయించారన్నారు. అలాగే బీసీ వర్గానికి చెందిన కర్ణాటక ప్రస్తుత సీఎం సిద్దరామయ్యను కామారెడ్డికి తీసుకొచ్చి ఆయనతో బీసీ డిక్లరేషన్ చేయించారన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావస్తున్నా రిజర్వేషన్ పెంపు విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. అధికారం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను మోసం చేసి, మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు రిజర్వేషన్ పెంపు సాధించుకోకపోతే నష్టపోయేది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలేనని అన్నారు. అందుకుగాను జూన్ 11వ తేదీలోగా రిజర్వేషన్ పెంపుపై సీఎం నిర్ణయం తీసుకోని పక్షంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా సంఘటితం కావాలని మంద కృష్ణమాదిగ పిలుపునిచ్చారు.