Mancherial | మంచిర్యాల నియోజకవర్గంలో రూ.1,500 కోట్లతో 9,406 అభివృద్ధి పనులను చేపట్టారు. వన్టౌన్, టూటౌన్ మధ్య రూ. 8 కోట్లు వెచ్చించి రైల్వే అండర్ బ్రిడ్జిని నిర్మించారు. రూ.34 కోట్లతో 4వ కడెం డిస్ట్రిబ్యూటరీ కాల్వ లైనింగ్ పనులు చేపడుతున్నారు. రూ.93 కోట్లతో హాజీపూర్ వద్ద ఎత్తిపోతలను నిర్మించనున్నారు. 186 ఎకరాల సింగరేణి స్థలంలో 2,000 మందికి పట్టాలు పంపిణీ చేశారు.
1952లో లక్షెట్టిపేట అసెంబ్లీ కేంద్రంగా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాలను నియోజకవర్గంగా మార్చారు. మొదటిసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గడ్డం అరవిందరెడ్డి గెలుపొందారు. 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన నడిపెల్లి దివాకర్రావు తాజా ఎన్నికల్లోనూ అధికార పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో మారిన రూపురేఖలు
తొమ్మిదిన్నరేండ్లలో నియోజకవర్గంలో రూ. 1,500 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టారు. 1,30,811 మందికి సంక్షేమ ఫలాలు అందజేశారు. రహదారుల విస్తరణ, వంతెనలు, నూతన రహదారులు, పట్టణాల్లో సుందరీకరణ పనులు చేపట్టడంతో నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది.
రూ. ఏడున్నర కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు
మంచిర్యాల, లక్షెట్టిపేట, నస్పూర్ మున్సిపాలిటీల్లో ఒక్కోచోట రూ. ఏడున్నర కోట్లు వెచ్చించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను నిర్మిస్తున్నారు. వన్టౌన్, టూటౌన్ల మధ్య రూ. 8 కోట్లతో రెండు వరుసల రైల్వే అండర్ బ్రిడ్జిని నిర్మించారు. రూ.140 కోట్లతో మెడికల్ కళాశాలను నిర్మిస్తున్నారు.
రోడ్ల నిర్మాణం, విస్తరణ..
రూ.47 కోట్ల డీఎంఎఫ్టీ నిధులు వెచ్చించి మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీల్లో రోడ్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ పనులను చేపట్టారు. రూ.13 కోట్లతో మంచిర్యాల లక్ష్మీ టాకీసు నుంచి వైశ్యభవన్ వరకు బైపాస్ రోడ్డు నిర్మించారు. మంచిర్యాలలో రూ.15 కోట్లతో రహదారుల విస్తరణ చేపడుతున్నారు. రూ.17 కోట్లతో మంచిర్యాలలో మాతాశిశు దవాఖాన నిర్మాణం పూర్తికాగా, రూ.8 కోట్లతో లక్షెట్టిపేటలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు.
రూ.93 కోట్లతో హాజీపూర్ వద్ద ఎత్తిపోతల
ఇరిగేషన్ శాఖ నుంచి రూ.34 కోట్లు వెచ్చించి 4వ కడెం డిస్ట్రిబ్యూటరీ కాల్వ లైనింగ్ పనులు చేపడుతున్నారు. రూ.93 కోట్లతో హాజీపూర్ వద్ద ఎత్తిపోతలను నిర్మించనున్నారు. రూ.164 కోట్లతో మంచిర్యాల – అంతర్గాం మధ్య గోదావరి నదిపై వంతెన ఏర్పాటు చేయనున్నారు. మంచిర్యాలలో రూ.59 కోట్లతో భగీరథ పనులు చివరి దశలో ఉన్నాయి. రూ.35 కోట్లతో ఐబీ చౌరస్తా నుంచి శ్రీనివాస టాకీసు వరకు ఆరు వరుసల రహదారి, రంగంపేట వద్ద రూ.12 కోట్లతో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి.
సింగరేణి కోల్బెల్ట్ నస్పూర్, శ్రీరాంపూర్ ఏరియాలో 40 ఏండ్లుగా 186 ఎకరాల సింగరేణి స్థలంలో నివాసం ఉంటున్న కార్మికులు, కార్మికేతర ప్రజలకు సీఎం కేసీఆర్ యాజమాన్య పట్టాలు అందజేశారు. ఈ ప్రాంతాల్లో 3,300 మంది కార్మికులు, కార్మికేతర కుటుంబాలు నివసిస్తున్నాయని అధికారులు సర్వేలో తేల్చారు. వీరిలో ఇప్పటివరకు 2,000 మందికి
పట్టాలు పంపిణీ చేశారు.
…? వేముల కుమారస్వామి