ఇల్లంతకుంట రూరల్, మార్చి 14: మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు శనివారం గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయన్ను పలు సమస్యలపై నిలదీశారు. గ్రామంలోని వందలాది మంది రైతులకు ఉపయోగపడే బతుకమ్మ చెరువును ఎందుకు నింపడంలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రూ.15 వేల రైతుభరోసా ఇస్తానని రేవంత్రెడ్డి అన్నాడు.. ఇప్పుడు నాలుగు సీజన్ల రైతుభరోసా ఇయ్యలేదు.. ఇంకెప్పుడిస్తారని నిలదీశారు. గ్రామంలో రెండేండ్ల క్రితం రూ.20 లక్షలతో ఆరోగ్య ఉపకేంద్రం నిర్మిస్తే.. ఇంతవరకు ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. ఈ విషయాన్ని కలెక్టర్ను అడగండి.. అంటూ ఎమ్మెల్యే సమాధానం చెప్పడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంపై మండిపడుతున్నారు.