హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమగ్రంగా మార్చే మన ఊరు-మన బడి కార్యక్రమ పనులు ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సివిల్వర్క్స్, రంగులు వేసేపనులు శరవేగంగా సాగుతున్నాయి. తొలి విడతలో ఎంపికైన పాఠశాలల్లో 96.92% పనులకు అనుమతులు మంజూరయ్యాయి. వీటిలో 81% స్కూళ్లలో పనులు గ్రౌండింగ్ అయ్యా యి. మరికొన్ని బడుల్లో పనులు పూర్తికావస్తున్నాయి. ఇప్పటికే పనులు పూర్తిచేసిన బడుల్లో రంగులు వేస్తున్నారు. తొలి విడతలో 9,123 స్కూళ్లలో పనులు ప్రారంభించారు.
తొలుత రూ.30 లక్షల లోపు విలువైన పనులను టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో చేపట్టారు. వీటికి ఆయా జిల్లాల కలెక్టర్లు అనుమతులు మంజూరుచేశారు. పథకంలో భాగంగా రూ.30 లక్షలకు మించి అంచనా వ్యయం గల పనులను చేపట్టేందుకు అధికారులు టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. మొత్తంగా మండలానికి రెండేసి పాఠశాలలను పూర్తిస్థాయిలో సిద్ధం చేసేందుకు అధికారులు కృషిచేస్తున్నారు.