హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): సర్కారు బడుల స్వరూపాన్ని సమగ్రంగా మార్చే మన ఊరు -మన బడి కార్యక్రమ పనులు శరవేగంగా కొసాగుతున్నాయి. తొలి విడతలో చేపట్టిన 9,123 బడుల్లో ఇప్పటివరకు 1,210 బడులు సిద్ధమయ్యాయి. వీటిలో చేపట్టిన పనులతోపాటు అదనంగా సౌర విద్యుత్తు సరఫరా, గ్రీనరీ ఏర్పాట్లు చేయాల్సి ఉన్నది. చాలా బడుల్లో ఇప్పటికే సివిల్ పనులు పూర్తికాగా.. కొన్నింటిలో రంగులేయడం, అందమైన చిత్రాలు గీయించడం వంటి పనులు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఈ పాఠశాలలకు డ్యూయల్ డెస్క్ బల్లలు, గ్రీన్ చాక్పీస్ బోర్డులు, టీచర్ టేబుళ్లు, కంప్యూటర్ టేబుళ్లు, కుర్చీలు, ల్యాబరేటరీ టేబుళ్లు, స్టూల్స్, గ్రంథాలయ టేబుళ్లు, కుర్చీలను పంపిణీ చేశారు. మిగిలిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని అధికారులు గడువుగా పెట్టుకున్నారు.
నిధుల విడుదలలో మార్పు
మన ఊరు -మన బడి కార్యక్రమానికి నిధుల విడుదలలో అధికారులు కీలక సంస్కరణలు అమలు చేస్తున్నారు. పలు సమస్యలు ఉత్పన్నం అవుతుండటంతో పాత విధానానికి స్వస్తిపలికి.. చకాచకా నిధులు విడుదల చేస్తున్నారు. ఈ పథకంలో ఇదివరకు జిల్లాలకు గంపగుత్తగా నిధులను విడుదల చేసేవారు. ఈ నిధులు కలెక్టర్ల ఆధీనంలో ఉండేవి. సాంకేతిక అనుమతులు, పరిపాలనాపరమైన అనుమతులు మంజూరైన తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకొని పనులు చేపట్టేవి. పనులు పూర్తయిన తర్వాత యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వగానే నిధులు విడుదల చేసేవారు. అయితే, ఈ విధానంలో పనులు అసంపూర్తిగా జరిగిన జిల్లాల్లో నిధులు ఖర్చుకాక మిగులుతున్నాయి. నిధులున్నా వినియోగించలేని పరిస్థితులు తలెత్తేవి. పనులు పూర్తయిన చోట జిల్లాల్లో నిధుల కొరత సమస్య ఏర్పడేది. .
పనులు పూర్తైన బడులు
ఇప్పటివరకు జిల్లాల వారీగా పనులు పూర్తయిన పాఠశాలలు ఈ విధంగా ఉన్నాయి. ఆదిలాబాద్ (37), భద్రాద్రి కొత్తగూడెం (46), హనుమకొండ(28), హైదరాబాద్ (32 ), జగిత్యాల (36 ), జనగామ (24 ), జయశంకర్ భూపాలపల్లి (22), జోగులాంబ గద్వాల (24 ), కామారెడ్డి (44 ), కరీంనగర్ ( 30 ), ఖమ్మం (62), కుమ్రంభీం ఆసిఫాబాద్ (30), మహబూబాబాద్ (32 ), మహబూబ్నగర్ (32), మంచిర్యాల (36), మెదక్ (42 ), మేడ్చల్ మల్కాజిగిరి (30), ములుగు (18), నాగర్కర్నూల్ (40), నల్లగొండ (62 ), నారాయణపేట (22 ), నిర్మల్ (38 ), నిజామాబాద్ (59 ), పెద్దపల్లి (28 ), రాజన్న సిరిసిల్ల (26 ), రంగారెడ్డి (55), సంగారెడ్డి (55 ), సిద్దిపేట (48), సూర్యాపేట (46 ), వికారాబాద్ (38), వనపర్తి (28 ), వరంగల్ (26 ), యాద్రాద్రి భువనగిరి (34 )గా ఉన్నాయి. వీటిని బట్టి మొత్తం 1,210 బడుల్లో పనులు పూర్తయ్యాయని చెప్పొచ్చు.
రాజ్యసభలో కేంద్రమంత్రి అన్నపూర్ణాదేవి
హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా గత సంవత్సరకాలంలో 20,021 పాఠశాలలు మూతపడ్డాయని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు. రాజ్యసభలో బీఆర్ఎస్ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య కూడా 1,89,302 మేర తగ్గిందని తెలిపారు. 2021-22లో పాఠశాలల సంఖ్య 15,09,136 నుంచి 14,89,115కు, ఉపాధ్యాయుల సంఖ్య 96,96,425 నుంచి 95,07,123కు తగ్గిందని వివరించారు. ఉపాధ్యాయుల సంఖ్య తగ్గినప్పటికీ వివిధ రకాల ప్రత్యేక ఏర్పాట్లతో విద్యాబోధనలో నాణ్యత తగ్గకుండా చూస్తున్నామని పేర్కొన్నారు.