హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు- మనబడి’, ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమ ఫలితాలు అందివస్తున్నాయి. ఈ పథకం కింద తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1,240 ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ రకాల సదుపాయాలు కల్పించారు. ఆయా పాఠశాలలను ఈ నెల 30న ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పండుగ వాతావరణంలో జరుగనున్న ఆయా కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొననున్నారు. రాష్ట్రంలో సర్కారు బడుల రూపురేఖలను సమగ్రంగా మార్చేందుకు ఉద్దేశించిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 2022 మార్చి 8న వనపర్తిలో శ్రీకారం చుట్టారు.
మొదటి విడతలో రూ.3,497.62 కోట్లు వెచ్చించి, 9,123 స్కూళ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12 అంశాలను ప్రాతిపదికగా తీసుకుని స్కూళ్లను ఎంపిక చేశారు. వీటిలో ఇప్పటివరకు దాదాపు 1,240 స్కూళ్లు సిద్ధమయ్యాయి. ఆయా పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం, తాగునీటి వసతి కల్పన, అవసరమైన మరమ్మతులు, విద్యుత్తు సౌకర్యం, ఫర్నీచర్, గ్రీన్ చాక్పీస్ బోర్డుల ఏర్పాటు, ప్రహరీగోడలు, అదనపు తరగతి గదులు, డైనింగ్హాళ్ల నిర్మాణం, పెయింటింగ్, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు తదితర కార్యక్రమాలు చేపట్టారు. బడుల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులను సైతం భాగస్వాములను చేస్తున్నారు. ఇందుకు బడులన్నింటిలో అలూమ్ని అసోసియేషన్లను ఏర్పాటు చేసి, వారి సహకారం తీసుకుంటున్నారు.