హైదరాబాద్: మన ఊరు – మన బడి విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. తాజాగా దానికి సంబంధించి విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో మన ఊరు – మన బడి, పట్టణాల్లో మన బస్తీ – మన బడితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రూ.7289.54 కోట్లతో దశలవారీగా పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. దశలవారీగా పాఠశాలల్లో మౌలికవసతుల అభివృద్ధి, డిజిటల్ విద్యను అందిస్తారు. మూడేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు ఉంటాయి. మొదటి దశలో 9123 పాఠశాలల్లో కార్యక్రమం అమలు జరుగుతుంది.
మొదటి దశ కార్యక్రమం కోసం రూ.3497.62 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలల్లో తొలి దశ కార్యక్రమం జరుగుతుంది. 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం కల్పించనున్నారు. అందులో టాయిలెట్స్, ఎలెక్ట్రిఫికేషన్, మంచి నీళ్లు, స్టూడెంట్స్, స్టాఫ్ కోసం ఫర్నీచర్, పాఠశాలకు పెయింటింగ్, మేజర్, మైనర్ రిపేర్లు, గ్రీన్ చాక్ బోర్డ్స్, కాంపౌండ్ వాల్స్, కిచెన్ షెడ్స్, కొత్త క్లాస్ రూమ్స్, డైనింగ్ హాల్స్, డిజిటల్ ఎడ్యుకేషన్ లాంటి మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు.