హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కాచిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మన బస్తీ మన బడి కార్యక్రమం పై నిర్వహించిన సమీక్షలో అధికారులతో మాట్లాడారు. అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించారు.
ప్రతి ఒక్కరూ చదువు ప్రాధాన్యతను తెలుసుకోవడం వల్ల పిల్లలను పాఠశాలలకు పంపిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుండడం వల్ల పేదలు, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు మనబస్తీ-మనబడి కార్యక్రమం ద్వారా మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించడం, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు.
ఈ పనులు మూడు నెలల్లో నూరు శాతం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు.హైదరాబాద్ జంట నగరాల్లో మొదటి విడతగా 239 పాఠశాలలు ఎంపిక చేసి అభివృద్ధి పరచనున్నట్లు వెల్లడించారు. నీటి సౌకర్యం , ఫర్నిచర్,పేయింటింగ్, విద్యుత్, కంపౌండ్ వాల్, మరుగుదొడ్లు, వంటశాల, డిజిటల్ ఎడ్యుకేషన్ తదితర వాటి నిర్మాణాలను చేపట్టి పూర్తి చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్యాదవ్ తెలిపారు. సమావేశంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, కలెక్టర్, వాటర్ వర్క్స్ ఎండీ , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.