హైదరాబాద్ సిటీబ్యూరో/హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ట్యాంక్బండ్ శివకు ఇటీవల డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయింపులో ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి కేటీఆర్.. తాజాగా విద్యుత్తు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన ఓ వ్యక్తి దీనగాధపై స్పందించి డబుల్ బెడ్రూం ఇంటిని మంజూరు చేశారు. సదరం సర్టిఫికెట్ ఇప్పించి, త్వరలోనే దివ్యాంగుల పింఛన్ అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాజులరామారం షాపూర్నగర్లో ఉంటున్న సత్యనారాయణ గత ఏడాది మే నెలలో విద్యుత్తు ప్రమాదానికి గురై రెండు చేతులు కోల్పోయారు. దీంతో కుటుంబ పోషణ భారం ఆయన భార్యపై పడింది. అమె రోజువారీ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
సత్యనారాయణకు అన్నం తినిపించడం వంటి రోజువారీ పనులను అయన ఐదేండ్ల కూతురు చందనప్రియ చేస్తున్నది. రెండు చేతులు కోల్పోయిన తనకు దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. కేవలం తన భార్య సంపాదించే పైసలతో ప్రస్తుతం ఉంటున్న ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడిందని, మానవతా దృక్పథంతో ఉండడానికి ఒక గూడు కల్పించాలని విజ్ఞప్తిచేశారు. మీడియా ద్వారా విష యం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. మంత్రి ఆదేశాలతో అధికారులు బాలానగర్లోని చిత్తారమ్మ బస్తీలో సత్యనారాయణకు డబుల్బెడ్రూం ఇల్లు కేటాయించగా, కేటాయింపు ఆర్డర్ను అధికారులు అందజేశారు. తమ కుటుంబానికి మంత్రి కేటీఆర్ చేసిన సాయం గొప్ప నైతిక బలాన్ని ఇచ్చిందని, కష్టకాలంలో తమకు అండగా నిలిచిన మంత్రి కేటీఆర్ను జీవితాంతం గుర్తుంచుకుంటామని ఈ సందర్భంగా సత్యనారాయణ ఉద్వేగానికి లోనయ్యారు.