రంగారెడ్డి, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): బండి పోతే బండి. కారు పోతే కారు. ఇవి వరదల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రగల్భాలు. కానీ ఒక్కరికి కూడా కారుకు కారిచ్చింది లేదు.. బండికి బండి ఇప్పించిందీ లేదు. నాలుగు ఓట్ల కోసం పబ్బం గడుపుకోవడానికి మాటలు చెప్పిన బండి.. ఆ తరువాత కంటికి కూడా కనిపించకుండా పారిపోయారు. టీఆర్ఎస్ సర్కారు అలా కాదు. కేసీఆర్ ప్రభుత్వం దగ్గర ప్రజలకు ప్రయోజనాలు కల్పించడమే తప్ప ఉత్తుత్తి మాటలు తెలియవు. టీఆర్ఎస్ది చేతల ప్రభుత్వం. రెండేండ్ల క్రితం హైదరాబాద్లో వచ్చిన వరదల్లో కారు పోగొట్టుకున్న దళిత పేదకు దళితబంధు పథకం కింద కొత్త కారు అందించి అండగా నిలిచింది.
కొందుర్గు మండలం రేగడి చిల్కమర్రి గ్రామానికి చెందిన నాగిళ్ల వెంకటేశ్ను నాడు మాటలు చెప్పిన నేతలు పట్టించుకోకపోయినా సీఎం కేసీఆర్ సహకారంతో దళితబంధు ద్వారా ఆదుకొన్నారు. కొత్త కారుతో నిత్యం ఉపాధి పొందుతూ.. దళితబంధు లక్ష్యాన్ని సాకారం చేశారు. హైదరాబాద్ వరదలకు ముందు నాగిళ్ల వెంకటేశ్ హైదరాబాద్ నగరంలో బ్యాంక్లోన్ ద్వారా కారును కొనుక్కొని ఉపాధి పొందేవారు. రెండేండ్ల కిందట హైదరాబాద్లో వచ్చిన వరదల్లో ఉన్న కారు కాస్తా కొట్టుకుపోయింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. ఇంతలనే సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ద్వారా వెంకటేశ్.. కారు కోసం దరఖాస్తు చేసుకోవడంతో ప్రభుత్వం గత జూన్లో కారును అందజేసింది. అతడికి ఆర్థిక భరోసాను కల్పించింది. గత రెండు నెలల నుంచి ప్రభుత్వం ఇచ్చిన కారు ద్వారా ఉపాధి పొందుతున్నాడు. అన్ని ఖర్చులు పోను రోజుకు కనీసం రూ.1000 మిగులుతున్నదని వెంకటేశ్ చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సహం మరువలేనిదని, సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.