నెక్కొండ, జూన్ 30 : మట్టి మాఫియాకు నిండు ప్రాణం బలైన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్రావుపేట చెరువు కట్టపై చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. వెంకటాపురానికి చెందిన సొల్లేటి సునీల్ (41) తన ఇద్దరు కూతుళ్లను మంగళవారం నెక్కొండలోని ఆదర్శ గురుకుల పాఠశాలకు తీసుకెళ్లాడు. తిరిగి వస్తుండగా అప్పల్రావుపేట చెరువుకట్టపై ఎదురుగా వస్తున్న టిప్పర్ బైక్ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన సునీల్ను స్థానికులు నర్సంపేటలోని ప్రైవేట్ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. నష్టపరిహారం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులతో కలిసి కుటుంబసభ్యులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు.
దీంతో నెక్కొండ-మహబూబాబాద్ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. ఏసీపీ రవీందర్, సీఐ శ్రీనివాస్, ఎస్సై మహేందర్తోపాటు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేందుకు యత్నించగా బాధితులు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అండగా నిలిచారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేస్తున్న మట్టి దందాతోనే సునీల్ మృతిచెందాడని రూ. కోటి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తరఫున రూ. 5 లక్షలు విరాళంగా అందిస్తామని హామీనిచ్చారు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో కుటుంబసభ్యుల సమ్మతితో పోలీసులు మృతదేహాన్ని దవాఖానకు తరలించారు.