మంథని : ఆర్టీసీ బస్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు హఠాన్మరణం చెందాడు. ఈ సంఘటన సోమవారం మంథనిలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తారం మండలం సీతంపల్లి గ్రామానికి చెందిన మామిడి రాజేశం(58) అనే వ్యక్తి గత కొద్ది రోజుల క్రితం కిందపడిపోవడంతో చేయి విరిగింది. దీంతో ఇంటి వద్దే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు.
ఈ క్రమంలో ఇవాళ కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్లో మంథనికి బయలుదేరాడు. బస్ మంథనికి చేరుతున్న సమయంలోనే రాజేశంకు గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఆసుపత్రికి వెళ్తూ రాజేశం మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకోగా.. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.