జగిత్యాల కలెక్టరేట్ : కూతురిని కాపురానికి తీసుకెళ్లడం లేదనే కోపంతో వియ్యంకురాలిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ సదరు మహిళను చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కేంద్రం అష్టలక్ష్మీ ఆలయ సమీపానికి చెందిన వెన్న మహేశ్ తన కూతురు గంగాభవానీని జగిత్యాల పట్టణానికి చెందిన గట్ల కిరణ్కు ఇచ్చి మూడేళ్ల కిందట వివాహం చేయగా.. ఆ దంపతులకు కొడుకు పుట్టాడు.
ఆ తర్వాత భార్యా భర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. గొడవలు ఎక్కువ కావడంతో గంగాభవానీ రెండేళ్ల నుంచి తల్లిగారింటి వద్దనే ఉంటుంది. కూతురు కాపురం విషయమై ఇరు కుటుంబాల మధ్య పలుమార్లు పంచాయితీలు జరిగాయి. కూతురును కాపురానికి తీసుకెళ్లడం లేదనే కోపంతో మహేశ్ సాయంత్రం కూతురు అత్తవారింటి వెళ్లాడు. ఆ సమయంలో అల్లుడు కిరణ్ ఇంట్లో లేకపోవడంతో వియ్యంకురాలైన గట్ల యమునతో గంగభవానీ కాపురం విషయమై మాట్లాడాడు.
ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. దీంతో ఆగ్రహానికి గురైన మహేశ్ తన మోపెడ్లో దాచి ఉంచిన కత్తితో యమునపై విచక్షణారహితంగా దాడి చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.