Aasara Pensions | తెలంగాణ చౌక్: ఆసరా పెన్షన్లు ఇప్పిస్తానని అమాయకుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన ఓ మోసగాడిని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
సిరిసిల్ల పట్టణంలోని రెడ్డివాడకు చెందిన బైరగోని లింగయ్య జిల్లాలోని మారుపాక గ్రామానికి చెందిన బోయిన సుజాతకు ఆసరా పెన్షన్ ఇప్పిస్తానని ఆమె వద్ద నుంచి డబ్బులు తీసుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత ఆమెకు పెన్షన్ ఓకే చేయించానని చెప్పాడు. ఆమెను నమ్మించేందుకు నెలనెలా సుజాత అకౌంట్లో రూ.2వేల జమచేశాడు. ఈ విషయం చుట్టుపక్కల అందరికీ తెలిసేలా చేశాడు. సుజాత కూడా బైరగోని లింగయ్య నిజంగా పెన్షన్లు ఇప్పిస్తాడని అందరికీ చెప్పింది. ఇదే అదునుగా పడిగెల నాగవ్వ, పడిగెల అపర్ణ, కుమ్మరి భాగ్యలకు కూడా పెన్షన్ ఇప్పిస్తానని లింగయ్య నమ్మించాడు. ఒక్కొక్కరి నుంచి రూ.13,500 చొప్పున మొత్తం రూ.40,500 వసూలు చేశాడు. అప్పట్నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు లింగయ్యను అరెస్టు చేశారు. అతని దగ్గర నుంచి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితుడి ద్వారా మోసపోయిన బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.