RS Praveen Kumar | హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని గతంలో రెండుసార్లు ఎంపీగా గెలిపిస్తే ప్రజలు, యువత కోసం ఏమీ చెయ్యలేదని నాగర్కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. మల్లు రవి మాత్రం కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారని ధ్వజమెత్తారు. తన స్వార్థం కోసం అనేక కంపెనీలను స్థాపించుకున్న మల్లు రవి యువత కోసం ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేదని ఆరోపించారు. అంతేగాక ఎంపీగా గెలువకముందు మల్లురవికి హైదరాబాద్లో సొంత ఇల్లు కూడా లేదని, కానీ ఇప్పుడు కోట్లాది రూపాయల విలువైన ఇల్లు, లగ్జరీ కార్లు, విలాసవంతమైన విల్లాలు, పలు కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు.
ఎన్నికల అఫిడవిట్లో ఆయన సమర్పించిన వివరాల ఆధారంగానే తాను మాట్లాడుతున్నానని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కొడుకుతో అనేక కంపెనీలు పెట్టించి కోట్ల రూపాయలకు ఎగబాకిన మల్లురవి నాగర్కర్నూల్ను ఎందుకు అభివృద్ధి చేయలేదని నిలదీశారు. మల్లు రవి కేవలం తన కుటుంబం కోసమే పాకులాడుతారని, ప్రజల సమస్యలు ఆయనకు పట్టవని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు. మళ్లీ ఇప్పుడు ఆయనను ఎంపీగా గెలిపిస్తే మరిన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటారని, మరిన్ని కంపెనీలను స్థాపించుకుంటారని చెప్పారు. కాబట్టి ‘మల్లూ.. ఇక వెనక్కి మల్లు’ అనే నినాదంతో ముందుకుపోదామని, ప్రజలను పట్టించుకోని వ్యక్తికి తగిన బుద్ధి చెపుదామని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు.