హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ ఎంపీ టికెట్ తనకే వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. తనకు టికెట్ వచ్చేందుకు పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నాయని స్వయంగా సీఎం రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారని చెప్పారు. సచివాలయంలోని మీడియా పాయింట్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశానని, దానిని ఇంకా ఆమోదించలేదని చెప్పారు. సోమవారం ఉదయం సీఎం రేవంత్రెడ్డిని కలిశానని, ఎంపీ టికెట్కు, తన పదవికి సంబంధమే లేదని చెప్పారని, నాగర్కర్నూల్ ఎంపీ టికెట్ రావడానికి ప్రయత్నిస్తానని సీఎం భరోసా ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కోసం 35 ఏండ్లు పనిచేసిన తనకే టికెట్ ఇవ్వాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లు కూడా దాటవని, కాంగ్రెస్కు 200 సీట్లు, ఇండియా కూటమికి 350 సీట్లు వస్తాయని చెప్పారు. ద్వారకలో సముద్రం లోపలికి వెళ్లి పూజలు చేశానని, కృష్ణుడికి నెమలిపింఛం సమర్పించానని చెప్పడం ద్వారా ప్రధాని మోదీ మరో డ్రామాకు తెరలేపారని విమర్శించారు. అకడ ద్వారక ఉన్నదని, కృష్ణుడు ఉన్నాడని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ఎన్నికల వేళ రాముడి, కృష్ణుడి పేర్లను వాడుకుంటున్నారని విమర్శించారు.