హైదరాబాద్: హౌస్ లిస్టింగ్ పూర్తిచేసుకుని ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్లు ఎన్యుమరేటర్లతో విస్తృతంగా మాట్లాడాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతుంటాయని, ఈ నేపథ్యంలో ఎన్యుమరెటర్లతో కలెక్టర్లు ఎప్పటికప్పుడు మాట్లాడితే వారి సందేహాలు ఏంటో వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రజల సందేహాలను కలెక్టర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి ప్రజల అనుమానాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువసార్లు సర్వేలో భాగస్వాములు అయ్యేలా చూడాలని అధికారులను కోరారు.
సమగ్ర కుటుంబ సర్వే చాలా పెద్ద కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాన్ని ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తున్న అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు. క్వశ్చనీర్ పకడ్బందీగా రూపొందించారని, ఎన్యుమరేటర్లకు తగిన శిక్షణ ఇచ్చారు, హౌస్లిస్ట్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఇదే విధంగా కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఈ దేశంలో జరిగే అతిపెద్ద కార్యక్రమం ఇది.. మనం చూపే నిబద్ధతపైనే ఈ సర్వే విజయవంతం అవడం ఆధారపడి ఉంటుందన్నారు.
యావత్ దేశం తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న కుటుంబ సర్వేను గమనిస్తుందని చెప్పారు. దేశంలో ప్రగతిశీల భావాలను, కార్యక్రమాలను వ్యాప్తి చేయడానికి ఈ సర్వే గొప్పగా ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్లు ఏ విషయాన్నీ నిర్లక్ష్యం చేయకుండా ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్న అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని, ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు. సర్వేపై కలెక్టర్లతో పాటు అన్ని స్థాయిలోని అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ప్రధానంగా పట్టణాలపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.