Mallu Bhatti Vikramarka | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 29(నమస్తే తెలంగాణ): దేశ సంపదను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పాదయాత్ర చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. కొన్ని కార్పొరేట్ శక్తులు పాదయాత్రను అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. దేశంలో ఆర్థిక అసమానతలు పోగొట్టి, లౌకికవాదాన్ని కాపాడడమే లక్ష్యంగా రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రను కాంగ్రెస్ శ్రేణులు గడపగడపకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సోమవారం సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని, రాష్ట్రంలో బీసీ జనగణన చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని తెలిపారు. దేశ సంపదను అందరికీ సమానంగా పంచేందుకు బీసీ జనగణన జరగాలని రాహుల్ భావిస్తున్నారని పేర్కొన్నారు. రాముడి పేరిట రాజకీయాలు చేస్తున్న బీజేపీ మతం పేరిట అలజడి సృష్టించి ఓట్లు పొందాలని చూస్తున్నదని దుయ్యబట్టారు. వారి కుయుక్తులు, ఆటలను కాంగ్రెస్ సాగనివ్వదనీ తేల్చిచెప్పారు. రాముడిపై రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. అన్ని వర్గాలు, అన్ని మతాల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
హైదరాబాద్లో స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతవచ్చనే నమ్మకాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభివృద్ధి చేసిన హైదరాబాద్లోని విలువైన భూములను బీఆర్ఎస్ పాలకులు కొల్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు ఓటేస్తే, బీఆర్ఎస్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ తెచ్చిన చట్టాలకు మద్దతుగా పార్లమెంట్లో ఓటేసేందని విమర్శించారు.
బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని స్పష్టం చేశారు. ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెలికితీస్తామని చెప్పిన బీజేపీ గత పదేండ్లలో చేసినదేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ను గెలిపించేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు భట్టి పిలుపునిచ్చారు.