మేడ్చల్, జనవరి 2: మల్లారెడ్డి విశ్వవిద్యాలయం ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎంఆర్యూ సెట్) ఏప్రిల్ 23 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్టు వర్సిటీ వీసీ వీఎస్కే రెడ్డి తెలిపారు. ఈ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉపకార వేతనాలను అందించేందుకు యాజమాన్యం రూ.10 కోట్లను కేటాయించిందని వెల్లడించారు. ప్రతిభ ఉండి, చదువుకోలేని పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇదొక సువర్ణావకాశమని పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి వర్సిటీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎంఆర్యూసెట్ కోసం రిజిస్ట్రేషన్లను ప్రారంభించామని తెలిపారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల బోర్డులు, సెంట్రల్ బోర్డు, ఇతర గుర్తింపు పొందిన సంస్థల విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షను వినియోగించుకోవచ్చని సూచించారు. ఇంజినీరింగ్, వ్యవసాయం, పారా మెడికల్, మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్ పాలసీల కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. వివరాలకు www.mallareddyuniversity. ac.in సంప్రదించాలని కోరారు. అనంతరం ప్రవేశ పరీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో అగ్రికల్చర్ డీన్ ప్రొఫెసర్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.