సిద్దిపేట/చేర్యాల, జనవరి 2 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 15 వేల మందికి పైగా భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
భక్తులు శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకొని ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి మొక్కులు తీర్చుకున్నారు.
మరికొంత మంది భక్తులు స్వామి వారి నిత్య కల్యాణోత్సవం మొక్కులు చెల్లించుకున్నారు.
కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు.