హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): తాను పార్టీ మారడం లేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతానని మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా పార్టీ మారుతున్నారనే ప్రచారంపై వారు కేటీఆర్కు వివరణ ఇచ్చినట్టుగా తెలిసింది. కొందరు కావాలనే తమపై తప్పుడు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, తమ విద్యాసంస్థల ప్రతిష్ఠ దెబ్బతిసే విధంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. తమ వద్ద అన్నిపత్రాలు ఉన్నా పాలకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. తన కుమారుడు భద్రారెడ్డి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తిగా లేడని కేటీఆర్కు మల్లారెడ్డి తెలిపారు. తన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డికి చెందిన విద్యాసంస్థలపైనా ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడుతున్నదని చెప్పారు. పార్టీ నిలబెట్టిన అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని చెప్పినట్టు తెలిసింది.