Rajanna Siricilla | రాజన్న సిరిసిల్ల : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కోనారావుపేట మండలం మల్కపేట గ్రామంలో ప్యాకేజీ – 9లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న 3 టీఎంసీ సామర్థ్యం గల మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కేటీఆర్ ఆదేశాల మేరకు మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ను చేపట్టేందుకు అధికారులు పక్షం రోజులుగా క్షేత్ర స్థాయిలో రాత్రింబవళ్లు శ్రమించారు.
అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పంపుహౌస్లో మోటర్లను ప్రారంభించి గోదావరి జలాలను మంగళవారం ఉదయం 7 గంటలకు మల్కపేట జలాశయంలోకి ఎత్తి పోశారు. ట్రయల్ రన్ పనులను ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎన్ వెంకటేశ్వర్లు, ఎత్తిపోతల సలహాదారు పెంటా రెడ్డి, ఎంఆర్కేఈఆర్, డబ్ల్యూపీఎల్ ఏజెన్సీల ప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షణ చేశారు.
ప్యాకేజీ -9 కార్యనిర్వహక ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి ట్రయల్ రన్ సమన్వయ బాధ్యతలు చూసారు. మల్కపేట రిజర్వాయర్ నిర్మాణంతో 60 వేల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందడంతో పాటు 26,150 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కానుంది. మల్కపేట రిజర్వాయర్ నిర్మాణంతో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలోని రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయి. రూ.504 కోట్లతో చేపట్టిన మల్కపేట రిజర్వాయర్ను త్వరలోనే ప్రారంభించనున్నారు.