Malkajgiri | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ను కన్నతల్లిలా భావించి మూడున్నర దశాబ్దాలపాటు సేవ చేస్తే చివరికి తనకు ఆవేదనే మిగిలిందని మేడ్చల్-మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కన్నీరు పెట్టుకున్నారు. పార్టీలో బీసీలకు న్యాయం జరిగే పరిస్థితి లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీకి సోమవారం గుడ్బై చెప్పేశారు. డీసీసీ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు రాజీనామా లేఖ పంపారు. నందికంటి రాజీనామాతో కాంగ్రెస్కు కోలుకోలేని దెబ్బపడింది. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్లోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగానూ పార్టీలోని బీసీ నేతల్లో ముసలం మొదలైంది. మల్కాజిగిరిలో మరికొందరు నేతలు కూడా శ్రీధర్ బాటలోనే రాజీనామాలకు సిద్ధమయ్యారు.
మేడ్చల్ మల్కాజిగిరి స్థానంపై శ్రీధర్ మొదటి నుంచీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు ఆ స్థానాన్ని తన్నుకుపోయే అవకాశాలు స్పష్టంగా ఉండడంతో నందికంటి పార్టీని వీడారు. మైనంపల్లి కాంగ్రెస్వైపు చూస్తున్నప్పటి నుంచే నందికంటితోపాటు మల్కాజిగిరి కాంగ్రెస్ నేతల్లో అభద్రతాభావం ఏర్పడింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితోపాటు హైకమాండ్ కూడా మైనంపల్లి వైపే మొగ్గు చూపడంతో శ్రీధర్ తన నిర్ణయాన్ని సోమవారం వెల్లడించారు. మేడ్చల్ డీసీసీ అధ్యక్ష పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సోమవారం సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ పంపారు.
సోమవారం మధ్యాహ్నం నందికంటి శ్రీధర్ మల్కాజిగిరి కాంగ్రెస్ కీలక నేతలతో పాటు దాదాపు వెయ్యి మందికిపైగా పార్టీ శ్రేణులతో రహస్య భేటీ నిర్వహించారు. మౌలాలిలోని క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్హాల్లో జరిగిన ఈ సమావేశంలోనే ఆయన పార్టీని వీడుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మూడున్నర దశాబ్దాలుగా పార్టీకి సేవ చేశానని, మల్కాజిగిరిలో పార్టీ బలోపేతానికి కృషి చేశానని పేర్కొన్నారు. పార్టీని తాను కన్నతల్లిలా భావిస్తే ఇప్పుడా కన్నతల్లే తనను మోసం చేసిందని కన్నీరు పెట్టుకున్నట్టు తెలిసింది. తాజా పరిణామాల నేపథ్యంలో కీలక నేతలు సహా వేలాదిమంది కాంగ్రెస్ను వీడే అవకాశం ఉంది. మంగళవారం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ అధ్యక్షుడు ఉమేశ్ సింగ్, మల్కాజిగిరి టౌన్ ప్రెసిడెంట్ వెంకటేశ్ యాదవ్, మల్కాజిగిరి డివిజన్ అధ్యక్షుడు నవీన్ తదితరులు ప్రకటించారు.
పార్టీని నమ్ముకున్న నందికంటి మూడున్నర దశాబ్దాలుగా సేవ చేస్తున్నారు. బీసీలకు 45 టికెట్లు ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్న వారిలో శ్రీధర్ కూడా ఉన్నారు. అలాంటిది తన సీటుకే ఎసరు వస్తుందని ఆయన ఊహించలేకపోయారు. మైనంపల్లికి ఎదురొడ్డి మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్న తననే రాష్ట్ర, జాతీయ నాయకత్వం బలి చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.
‘నేను నందికంటి శ్రీధర్. డీసీసీ పార్టీ ప్రెసిడెంట్ని. బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడిని. నేను కాంగ్రెస్ పార్టీలో 1994 సంవత్సరం నుంచి నిబద్ధతతో, అంకితభావం, చిత్తశుద్ధి, విధేయతతో పనిచేస్తున్నాను. తమరి దృష్టికి ఒక విషయం తీసుకురావాలని అనుకుంటున్నాను. 2018 నుంచి టికెట్ కోసం చాలా కష్టపడుతున్నాను. నా కష్టార్జితం, ఎన్నికల్లో గెలిచే శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ 2018వ సంవత్సరంలో పొత్తుల కారణంగా నాకు టికెట్ దక్కలేదు. ఈసారి (2023) బీసీ అభ్యర్థులందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఉదయ్పూర్ డిక్లరేషన్లో కుటుంబంలో ఒకరికి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కానీ తెలంగాణలో, ముఖ్యంగా మల్కాజ్గిరి, మెదక్ జిల్లాల్లో ఒక కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చారు. మైనంపల్లి హన్మంతరావుకు మల్కాజ్గిరి, అతని కుమారుడు రోహిత్కు మెదక్ నియోజకవర్గట టికెట్ ఇస్తున్నారు. దీనిపై మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులంతా న్యాయం కోసం పోరాటం చేశాం.
మైనంపల్లి హన్మంతరావు (బీఆర్ఎస్ అభ్యర్థి) కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులపై అక్రమ కేసులు నమోదు చేయడంతో పాటు పలు ఇబ్బందులకు గురి చేశాడు. అటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొత్తగా వచ్చిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పరిశీలిస్తోందని సమాచారం. ఇది అన్యాయం. ఈ ఇద్దరు అభ్యర్థులు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తానని బీఆర్ఎస్ నుంచి వచ్చారు. ఇక్కడ బీసీ వర్గానికి చెందిన టికెటును పరిగణనలోకి తీసుకోకుండా ఈ స్థానంలో ఓసీ అభ్యర్థికి టికెట్ను పరిశీలిస్తోంది. పార్టీలో బీసీ వర్గానికి చెందిన అభ్యర్థులకు న్యాయం జరగదని తీవ్ర నిరాశతో, విచారం వ్యక్తం చేస్తున్నాను. అందుకే నేను డీసీసీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరుతున్నాను’.