Etela Rajender |హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలో దిగనున్నారు. బీజేపీ కేంద్ర అధిష్ఠానం శనివారం లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో తొమ్మిది సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది.
నలుగురు సిట్టింగ్ ఎంపీలకు మరోసారి అవకాశమివ్వడంతో పాటు మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ను బరిలో నిలిపింది. మూడు రోజుల క్రితం పార్టీలో చేరిన బీబీ పాటిల్ను జహీరాబాద్ అభ్యర్థిగా, నాగర్కర్నూల్ నుంచి ఎంపీ రాములు కుమారుడు పీ భరత్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్రెడ్డి, సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్కుమార్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, హైదరాబాద్ అభ్యర్థిగా మాధవీలతను ప్రకటించింది. మిగిలిన ఏడు స్థానాలకు త్వరలో రెండో జాబితా విడుదల చేయనున్నది.