తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథలైన ఇద్దరు చిన్నారులు
మలక్పేట బంజారాబస్తీలో విషాదం
మలక్పేట, మార్చి 19: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీసింది. ఆటో గిరాకీలపై ప్రభావం చూపింది. ఆటోడ్రైవర్లు కిస్తీలు చెల్లించలేక కుటుంబపోషణ భారమై మనస్తాపాలకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక తాజాగా హైదరాబాద్లో మరో ఆటోడ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మలక్పేట ఠాణా పరిధి అఫ్జల్నగర్లోని బంజారాబస్తీలో చోటుచేసుకున్నది.
పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. బంజారాబస్తీకి చెందిన రాత్లావత్ లక్ష్మణ్కు ఇద్దరు కుమారులు, కూతురు. ముగ్గురికీ వివాహాలు కావడంతో ఎవరి బతుకువారు బతుకుతున్నారు. పెద్ద కొడుకు రాత్లావత్ గణేశ్ మార్కెటింగ్తో, చిన్న కుమారుడు రమేశ్ ఆటో డ్రైవర్గా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రమేశ్కు 2017లో సరిత తో పెండ్లి జరిగింది. ఇద్దరు బిడ్డలు జన్మించారు. పెద్దమ్మాయి ఎల్కేజీ, చిన్నమ్మాయి నర్సరీ చదువుతున్నారు.
కరోనాతో తల్లి.. ఇప్పుడు తండ్రి
2020లో కరోనా బారినపడి సరిత చనిపోవటంతో గత సెప్టెంబర్లో కర్ణాటకకు చెందిన ప్రియను రమేశ్ రెండో వివాహం చేసుకున్నాడు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటోకు గిరాకీ తగ్గటంతో రమేశ్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. సకాలంలో ఆటో ఫైనాన్స్ కిస్తీలు చెల్లించకపోవటంతో నాలుగు రోజుల క్రితం ఫైనాన్సర్లు ఆటోను లాక్కెళ్లి పోయారు. ఉన్న ఉపాధి కూడా పోవడంతో రమేశ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం తాను పనికి వెళ్తున్నానని చెప్పి లంచ్బాక్స్ తీసుకొని వెళ్లిన రమేశ్.. రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చాడు.
లంచ్బాక్స్ తినకుండా తీసుకురావటంతో బాధపడ్డ ప్రియ.. భోజనం వడ్డిస్తాననటంతో తనకు ఆకలిగా లేదని చెప్పాడు. ఎన్నిసార్లు బతిమలాడినా భోజనం చేయని రమేశ్.. తాను కాసేపు పడుకుంటానని, తనను లేపవద్దని భార్య ప్రియకు చెప్పి ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. ఉపాధి లేక, కుటుంబ పోషణ భారమవటంతో తీవ్ర మనస్తాపానికి గురై రమేశ్ చీరతో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. ఎంత పిలిచినా లోపలి నుంచి స్పందన రాకపోవడంతో కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు.
తీవ్ర ఆందోళనకు గురైన భార్య తలుపులను గట్టిగా బాదటంతో గడియ ఊడి తలుపులు తెరచుకున్నాయి. వెంటనే ఫ్యాన్కు వేసుకున్న చీరముడి విప్పిన ప్రియ రమేశ్ను నేలపై పడుకోబెట్టి ఇరుగు పొరుగువారిని పిలువగా, వారు చూసి అప్పటికే మృతిచెందినట్టు తెలిపారు. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవటంతో అనాథలైన ఇద్దరు చిన్నారులను గుండెలకు హత్తుకొని కుటుంబసభ్యులు రోదించటం పలువురిని కంటతడి పెట్టించింది.